హైదరాబాదులోని నాంపల్లి సీబీఐ కోర్టుకు బహుముఖ ప్రజ్ఞాశాలి అయినటువంటి ‘ఇండియన్ మైకేల్ జాక్సన్’గా పిలవబడే ప్రభుదేవా హాజరయ్యారు. ఆదాయపన్ను శాఖ అధికారి హరిప్రసాద్ అక్రమాస్తుల కేసులో సాక్ష్యం ఇచ్చేందుకు కోర్టుకు హాజరయ్యారు. గగన్ విహార్ లోని సీబీఐ కోర్టులో దాదాపు అర్ధగంట పాటు జరిగిన విచారణకు ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడేందుకు ప్రభుదేవా ఇష్టపడలేదు.
మెదక్ జిల్లాలోని ఓ భూమిని గతంలో హరిప్రసాద్ నుంచి ప్రభుదేవా కొన్నారని సీబీఐ విచారణలో తేలింది. ఈ క్రమంలోనే సమన్లు అందుకున్న ప్రభుదేవా కోర్టుకు విచ్చేసారు. అయితే తన మేనేజర్ ద్వారానే ఆ భూమిని తాను కొనుగోలు చేశానని, మిగతా విషయాలు తనకేమి తెలియవని ప్రభు కోర్టుకు చెప్పినట్లుగా సమాచారం. కొరియోగ్రాఫర్ గా కెరీర్ ప్రారభించిన ప్రభుదేవా ఆ తర్వాత నటుడిగా, దర్శకుడిగా అవతారాలు ఎత్తి, ప్రస్తుతం బాలీవుడ్ లో స్థిరపడిన విషయం తెలిసిందే.





