తమిళనాడులో జల్లికట్టుపై జరుగుతున్న ఆందోళనలకు తమిళ ప్రముఖ నటుడు, దర్శకుడు లారెన్స్ మద్దతు పలికారు. మెరీనా తీరంలో ఆందోళన చేస్తున్న విద్యార్థులను బుధవారం కలిసిన లారెన్స్, వారితో కలిసి నినాదాలు చేశారు. పోరాటంలో పాల్గొన్న వారి ఆకలి దప్పులు తీర్చేందుకు అయిన ఖర్చును తాను భరిస్తానని, కోటి రూపాయలు ఇచ్చేందుకైనా తాను సిద్ధమని ఈ సందర్భంగా సంచలన ప్రకటన చేశారు.
జల్లికట్టు కోసం ఒక్కటైన తమిళులకు చిత్రపరిశ్రమ మద్దతు తెలపడం హర్షణీయమన్నారు. జల్లికట్టు తమిళ సంప్రదాయానికి అద్దంపట్టే క్రీడ అనీ, కొన్ని విదేశీ శక్తులు దీనిని అడ్డుకోవాలని చూస్తున్నాయని, వాటిని అడ్డుకోవాలని పిలుపునిచ్చారు. విద్యార్థుల పోరాటాన్ని చూసైనా కేంద్రం దిగివస్తుందన్న నమ్మకం ఉందని లారెన్స్ ఆశాభావం వ్యక్తం చేశారు.
త్రిష ఉదంతం చూసిన తర్వాత చెన్నై సినీ సెలబ్రిటీలంతా ఒక్కొక్కరిగా జల్లికట్టుకు బహిరంగంగా మద్దతు ప్రకటిస్తున్నారు. ఇప్పటికే తమిళ హీరో శింబుతో సహా పలువురు ప్రముఖ హీరోలంతా సోషల్ మీడియా వేదికగా జల్లికట్టుకు ‘జై’ కొట్టగా, టాలీవుడ్ స్టార్ హీరోయిన్, త్వరలో అక్కినేని వారి ఇంట అడుగు పెట్టనున్న కోడలు సమంత కూడా జల్లికట్టుకు మద్దతుగా ట్వీట్ చేసింది.



