దేశవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన ‘అమర్ రాజా బ్యాటరీస్’ పుట్టుక, ప్రస్తానం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే సాగింది. కానీ రాజకీయ వేధింపుల కారణంగా ఏపీలో పెట్టాల్సిన ‘అమర్ రాజా గిగా కారిడార్’ తెలంగాణకు తరలిపోయింది. సుమారు రూ.9,000 కోట్లు పెట్టుబడితో మహబూబ్నగర్ జిల్లా దివిటిపల్లిలో ఏర్పాటైన ఈ సంస్థ నిర్మాణ పనులు పూర్తిచేసుకొని ఉత్పత్తి దశకు చేరుకుంది. తెలంగాణ సిఎం రేవంత్ రెడ్డి నేడు దీనిలో ‘సెల్ (బ్యాటరీ) తయారీ యూనిట్ను ప్రారంభించనున్నారు.
ఏపీతో సహా పలు రాష్ట్రాలు విదేశీ సంస్థలను రప్పించేందుకు కృషి చేస్తున్న ఈ సమయంలో ఏపీ పారిశ్రామికవేత్తలు ఈవిధంగా ఇరుగు పొరుగు రాష్ట్రాలలో, విదేశాలలో పెట్టుబడులు పెట్టి పరిశ్రమలు, ఐటి కంపెనీలు స్థాపించడం, వాటిలో వేలాదిమందికి ఉద్యోగాలు కల్పిస్తుండటం మనకి గర్వకారణమే.
ఆంధ్రా నుంచి లక్షలాది మంది నిరుద్యోగులు హైదరాబాద్కి వెళ్ళి ఉద్యోగాలు, ఉపాధి పొందుతున్నప్పుడు, ఏపీకి చెందిన ఇలాంటి పరిశ్రమలు తెలంగాణలో ఏర్పాటు కావడం ఆహ్వానించాల్సిందే.
కానీ రాజకీయ వేధింపులు కారణంగా ఏపీలో ఏర్పాటు కావాల్సిన ‘అమర్ రాజా గిగా కారిడార్’ తెలంగాణకు తరలిపోవడం, అందుకు కారకులైనవారు నేటికీ కనీసం పశ్చాతాప పడకపోవడం ఇంకా బాధాకరం. ఏపీకి కొత్తగా ఓ పరిశ్రమ, ఓ పోర్ట్ లేదా ఎయిర్ పోర్ట్ వస్తే దాని క్రెడిట్ క్లెయిమ్ చేసుకుంటున్నవారు, ఇలాంటి తప్పులు కూడా క్లెయిం చేసుకొని ఒప్పుకోవాలి కదా?




