బహుశః దేశంలో అధికారంలో ఉన్న ఏ రాజకీయపార్టీ కూడా తమ ఎంపీని అరికాళ్ళు వాచిపోయేలా కొట్టి ఉండదు. అలాగే ఏ ఎంపీ కూడా తన అధినేతపై కేసులు వేసి ఉండరు. సొంత పార్టీపైనే విమర్శలు, ఆరోపణలు చేసి ఉండరు. కానీ ఈ విచిత్రాలన్నీ వైసీపిలో జరుగుతున్నాయి.
వైసీపి నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణరాజు తమ అధినేత జగన్మోహన్ రెడ్డి నిందితుడుగా ఉన్న అక్రమస్తుల కేసుల విచారణ ముందుకు సాగనీయడం లేదని, కనుక వాటి విచారణ వేగవంతం చేయాలని కోరుతూ సుప్రీంకోర్టులో ఓ పిటిషన్ వేశారు. దానిపై నేడు విచారణ జరుగబోతోంది.
కానీ దాంతో ఆయన తృప్తి చెందక ఏపీ హైకోర్టులో కూడా మరో పిటిషన్ వేశారు. వైసీపి ప్రభుత్వం సంక్షేమ పధకాల మాటున అనేక అవకతవకలకు పాల్పడుతోందని, వీటిపై సీబీఐ చేత విచారణ జరిపించాలని కోరుతూ పిటిషన్ వేశారు.
అయితే రఘురామ కృష్ణరాజు దురుదేశపూరితంగా, ముఖ్యమంత్రిపై వ్యక్తిగత కక్షతోనే ఈ పిటిషన్ వేశారు తప్ప దీనిలో ఎటువంటి ప్రజాప్రయోజనం లేదని, కనుక దీనిని విచారణకు అనర్హమైనదిగా ప్రకటించాలని ఏపీ ప్రభుత్వం తరపున అడ్వకేట్ జనరల్ శ్రీరామ్ వాదించారు. కానీ హైకోర్టు ఈ పిటిషన్ను విచారణకు స్వీకరించడమే కాకుండా దానిలో ప్రతివాదులుగా పేర్కొన్న సిఎం జగన్మోహన్ రెడ్డి, మంత్రులు, అధికారులతో సహా మొత్తం 41 మందిని కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశిస్తూ నోటీసులు జారీ చేసింది. ఈ కేసు తదుపరి విచారణను డిసెంబర్ 14కి వాయిదా వేసింది.
రఘురామ కృష్ణరాజు తమ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డితో విభేదించినప్పటి నుంచి ఈ సమస్యలు మొదలయ్యాయి. ఆయన ఏవో విమర్శలు చేయడంతో వైసీపి ప్రభుత్వం ఆయనపై రాజద్రోహం కేసు పెట్టి అరికాళ్ళు వాచిపోయేలా లాఠీ దెబ్బలు తినిపించింది.
దాంతో ఆయన భయపడి ఢిల్లీకి పారిపోయి అక్కడ నుంచి వైసీపిపై ‘లాంగ్ రేంజ్ మిసైల్స్’ సందిస్తుండటం అందరికీ తెలిసిందే. ఆయన వైసీపికి ‘చిక్కడు దొరకడు.’ వైసీపిని వదిలిపెట్టడు. వైసీపి కూడా ఆయనను వదిలిపెట్టడం లేదు.
దీంతో నేటికీ ఆయన వైసీపి ఎంపీగానే చలామణి అవుతూ, మా వైసీపి ఓ ఫ్యాక్షనిస్ట్ పార్టీ, మా అధినేత జగన్మోహన్ రెడ్డి ఓ అరాచకవాది, మా అధినేత అవినీతిపరుడు… ఇలా మా పార్టీ, మావాడు అంటూనే కుమ్మేస్తూనే ఉన్నారు. ఢిల్లీలోనే కూర్చోనే ఇప్పుడు ఈ కేసులతో కూడా వైసీపిని చంపుకు తినేస్తున్నాడు. పైకి చెప్పుకోలేని బాధ కదా ఇది?




