వైసీపి ప్రభుత్వం ధాటికి భయపడి ఢిల్లీ పారిపోయిన నర్సాపురం వైసీపి ఎంపీ రఘురామ కృష్ణరాజు ప్రతీకారం తీర్చుకోగలరని ఎవరూ అనుకోలేదు. మహా అయితే మీడియా ముందుకు వచ్చి తమ అధినేత జగన్మోహన్ రెడ్డిని, పార్టీని, ప్రభుత్వాన్ని విమర్శించగలరు. ఆరోపణలు చేయగలరు. కానీ వాటిని పట్టించుకొనేదెవరు?అని వైసీపి భావించి ఉండవచ్చు. కానీ ఆయన ఢిల్లీలో కూర్చోనే ఏపీలో జగన్ కుర్చీ కింద మంట పెడుతున్నారు!
అక్రమాస్తుల కేసులో జగన్మోహన్ రెడ్డి తదితరులు పదేళ్ళుగా బెయిల్పై ఉన్నారని, సీబీఐ విచారణ ముందుకు సాగడం లేదని కనుక వారి బెయిల్ రద్దు చేసి ఆ కేసుల విచారణ వేగవంతం చేయాలని కోరుతూ సుప్రీంకోర్టు ఓ పిటిషన్ వేశారు. దానిపై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు ప్రతివాదులుగా పేర్కొన్న జగన్మోహన్ రెడ్డి, సీబీఐతో సహా అందరికీ నోటీసులు పంపింది.
రఘురామ కృష్ణరాజు ఏపీ హైకోర్టులో కూడా మరో పిటిషన్ వేశారు. వైసీపి ప్రభుత్వం సంక్షేమ పధకాల పేరుతో విచ్చల విడిగా ప్రజాధనం ఖర్చు చేస్తోందని కనుక వాటిపై సీబీఐ చేత విచారణ జరిపించాలని పిటిషన్ వేశారు. దానిని విచారణకు స్వీకరించిన హైకోర్టు జగన్మోహన్ రెడ్డి, మంత్రులు, అధికారులతో సహా మొత్తం 41 మందికి గురువారమే నోటీసులు పంపించింది.
ఎన్నికలు దగ్గర పడుతున్న ఈ సమయంలో ఒకేసారి హైకోర్టు, సుప్రీంకోర్టు నుంచి జగన్మోహన్ రెడ్డికి నోటీసులు రావడంతో వైసీపిలో బహుశః కలవరం మొదలయ్యే ఉండవచ్చు.




