ఓట్ చోరీ అంటూ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కేంద్ర ప్రభుత్వం పై పెద్ద ఎత్తున విమర్శలు ఎక్కుపెడుతునారు, అనేక రాజకీయ ఆరోపణలు చేస్తున్నారు, ఉద్యమాలకు పిలుపునిస్తున్నారు.
అయితే ఆంధ్రప్రదేశ్ లో కూడా ఈ ఓట్ చోరీ ఉందని, 2024 ఎన్నికలలో కూటమి ఈవీఎంల టాంపరింగ్ తోనే విజయాన్ని అందుకుందని, మొన్న జరిగిన పులివెందుల జడ్పీటీసీ ఉపఎన్నికలలో సైతం టీడీపీ రిగ్గింగ్ కు పాల్పడిందంటూ వైసీపీ అధినేత వైస్ జగన్ మోహన్ రెడ్డి కూటమి ప్రభుత్వం పై అనేక రాజకీయ ఆరోపణలు చేసారు.
అలాగే తన ఈ వాదనకు, వైసీపీ కి జరిగిన ఆ అన్యాయానికి కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మద్దతివ్వాలని, లేకుంటే బాబు, రాహుల్, రేవంత్ హాట్ లైన్ లో ఉన్నట్టే అంటూ రాహుల్ గాంధీ ని సైతం పులివెందుల పంచాయితీలోకి లాగారు జగన్.
అయితే ఇదంతా ఇలా ఉంటే, ఇప్పుడు జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్ దేశ వ్యాప్తంగా ఈ ఓట్ చోరీ దందా జరిగిందంటూ కేంద్ర ప్రభుత్వంతో ఉద్యమానికి సిద్దమయ్యింది. ఢిల్లీ కేంద్రంగా కాంగ్రెస్ నాయకులు సైతం భారత చీఫ్ ఎలక్షన్ కమిషన్ జ్ఞానేశ్ కుమార్ నివాసం వద్ద పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు.
వైసీపీ కి జరిగిన అన్యాయానికి కాంగ్రెస్ గొంతు విప్పాలని ఆకాంక్షిస్తున్న జగన్ మరి బీజేపీ కి వ్యతిరేకంగా కాంగ్రెస్ చేస్తున్న ఈ ఓట్ చోరీ ఉద్యమానికి పార్టీ పరంగా వైసీపీ నుంచి కాంగ్రెస్ కి మద్దతిస్తారా.? రాహుల్ తో పాటు జగన్ గొంతు కలిపి బీజేపీ కి వ్యతిరేకంగా నినాదాలు చేస్తారా.? నాడు కాంగ్రెస్ నాయకుడు రాహుల్ ని డిమాండ్ చేసిన జగన్ నేడు రాహుల్ బాటలో అడుగు కలపగలరా.?




