రాజమౌళి-మహేష్ బాబు కలిసి ‘గ్లోబ్ ట్రోటర్’ అంటే ప్రపంచాన్ని చుట్టివచ్చే ఓ సాహసయాత్రికుడి కధ అని అందరూ అనుకున్నారే తప్ప త్రేతాయుగం నుంచి కలియుగం వరకు, వారణాశి నుంచి అంటార్క్టికా వరకు ఈ కధ సాగుతుందని ఎవరూ ఊహించి ఉండరు.
నిన్న విడుదల చేసిన ఫస్ట్ గ్లిమ్స్ చూసినప్పుడు హాలీవుడ్ సినిమాలకు కూడా లేనంత పెద్ద బేస్ ఉన్న కధని సిద్దం చేసుకొని ‘వారణాశి’గా రూపొందిస్తున్నారని స్పష్టమైంది.
ఫస్ట్ గ్లిమ్స్లో త్రేతాయుగం నాటి రామాయణం, అప్పటి లంకా నగరం, క్రీస్తు శకం 517లో వారణాశి, శాంభవి అనే భారీ ఉల్క 2027లో అంటార్క్టికాలోని రాస్ మంచు పర్వతాలలో కూలడం, ఆఫ్రికాలోని అంబోసోలీ వైల్డ్ యానిమల్ పార్క్, ఎవరికీ తెలియని లేదా అందరూ మరిచిపోయిన వనాంచల్లోని ఉగ్రభట్టి గుహలు, చివరిగా మళ్ళీ వారణాశిలో మణికర్ణిక ఘాట్ వరకు ఈ కధ విస్తరించినట్లు చూపారు. .
ఫస్ట్ గ్లిమ్స్ విడుదలకు నాలుగు రోజుల ముందు బాలీవుడ్ సీనియర్ నటి ప్రియాంకా చొప్రా, ప్రముఖ మళయాళ నటుడు పృద్విరాజ్ సుకుమారన్ పోస్టర్స్ విడుదల చేశారు.
వాటిలో ఆమె చీర కట్టులో తుపాకీ కాల్చుతున్న మందాకినిగా చూపగా, వెన్ను కింది భాగం పనిచేయని స్థితిలో వీల్ చైర్లో కూర్చొన్న విలన్ కుంభగా చూపారు.
కేవలం 3.40 నిమిషాల నిడివి గల ఈ వీడియోలో గ్రాఫిక్స్, విజువల్స్, సౌండ్ ఎఫ్ఫెక్ట్స్ ప్రతీది అద్భుతంగా ఉంది. వేలకోట్ల బడ్జెట్తో తీసే హాలీవుడ్ సినిమాలతో పోటీ పడేలా ఉంది.
ఫస్ట్ గ్లిమ్స్లో శివుడి వాహనం నందీశ్వరుడు రంకెలు వేస్తూ పరుగు తీస్తుంటే, దానిపై మహేష్ బాబు (రుద్ర) త్రిశూలం చేతపట్టుకొని యుద్ధానికి బయలుదేరినట్లు చూపారు.
పురాణ గాధలను యధాతధంగా (మహా భారతం, రామాయణం) తీసిన సినిమాలు చాలానే ఉన్నాయి. అలాగే పురాణ గాధలను కలియుగంతో ముడిపెడుతూ లేదా వాటిలో యమధర్మరాజు, అశ్వథామ వంటి కొన్ని పాత్రలతో (యమగోల, కల్కి ఏడీ 2898) తీసిన సినిమాలో కోకోల్లలున్నాయి.
ఇప్పుడు రాజమౌళి ఆ హద్దులన్నీ దాటేసి త్రేతాయుగం నుంచి భవిష్యత్తులో జరుగబోయే ప్రళయం వరకు విభిన్న కాలాలలో జరిగిన కధని వారణాశిగా రూపొందిస్తున్నారు.
ఈ ప్రయత్నంలో ఆయన సఫలం అయితే యావత్ ప్రపంచ సినీ పరిశ్రమ భారతీయ పురాణాలు, మూలాలు వెతకడం మొదలుపెట్టినా ఆశ్చర్యం లేదు.






