నిన్న విజయవాడలో ఎన్టీఆర్ జయంతి వేడుకల అంకురార్పణ సభకి కోలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్ వచ్చారు. ముందుగా ఆయన ఏం మాట్లాడారో చెప్పుకోవడం అవసరం. “ఈ సభను చూస్తే రాజకీయాలు మాట్లాడనిపిస్తుంది. కానీ మనసు, అనుభవం వద్దువద్దని వారిస్తున్నాయి. అయినా ఇలాంటి గొప్ప సభలో నా ఆప్త మిత్రుడు చంద్రబాబు నాయుడు గురించి, రాజకీయాల గురించి రెండు ముక్కలు మాట్లాడకుండా ఉండలేకపోతున్నాను. చంద్రబాబు నాయుడు ఎంతో దూరదృష్టి ఉన్న నాయకుడు. ఆయన కారణంగానే లక్షలాదిమంది తెలుగువారు విదేశాలలో పెద్ద ఉద్యోగాలు సంపాదించుకొని హాయిగా జీవిస్తున్నారు. చంద్రబాబు నాయుడు పదవిలో ఉన్నా లేకున్నా ఎల్లప్పుడూ రాష్ట్రం కోసం… ప్రజల కోసమే ఆలోచిస్తుంటారు. ఆయన తన విజన్-2047 ప్రణాళిక గురించి నాకు క్లుప్తం చెప్పారు. దానిని అమలుచేస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దేశంలోనే నంబర్: 1 స్థానంలో ఉంటుంది.
ఇటీవల హైదరాబాద్లో పర్యటించినప్పుడు మాదాపూర్, బంజారాహిల్స్ తదితర ప్రాంతాలలో రాత్రిపూట తిరిగాను. అప్పుడు నేను హైదరాబాద్లో ఉన్నానా లేక న్యూయార్క్ నగరంలో ఉన్నానా?అనే సందేహం కలిగింది. ఆనాడు చంద్రబాబు నాయుడు బిల్ గేట్స్ వంటివారితో మాట్లాడి ఐటి కంపెనీలను హైదరాబాద్కు తీసుకురావడం వలననే ఇంత అభివృద్ధి జరిగింది. వాటి వలననే హైదరాబాద్ ఆర్ధికంగా చాలా వృద్ధి చెంది బలపడిందని తెలంగాణ సిఎం కేసీఆర్ నాకు చెప్పారు.
ఇంత దూరదృష్టి ఉన్న చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయితే తప్పకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కూడా దేశంలోనే నంబర్:1 రాష్ట్రంగా నిలుస్తుంది. చాలా మంది ఆయన గొప్పదనం గురించి గుర్తించలేకపోవచ్చు కానీ బయట ఉన్నవారికి ఆయన ఎంత గొప్ప మేధావో తెలుసు.” ఇదీ క్లుప్తంగా రజనీకాంత్ మాటల సారాంశం ఇది. ఈ సందర్భంగా ఆయన ఎన్టీఆర్ నటన, సినిమాలు, ఆయనతో తనకున్న అనుబందం గురించి చాలా చెప్పారు. వాటి గురించి వేరేగా చెప్పుకొందాము.
ఇటీవల సిఎం జగన్ అనంతపురంలో చంద్రబాబు నాయుడుని ఉద్దేశ్యించి ‘ముసలి నక్క’ అంటూ చాలా అనుచిత వ్యాఖ్యలు చేసారు. ఆ మాటలన్న నాలుగు రోజులకే… రజనీకాంత్ చంద్రబాబు నాయుడు గురించి ఇంత గొప్పగా చెప్పారు.
ఏపీ రాజకీయాలతో ఏమాత్రం సంబందం లేని పొరుగు రాష్ట్రంలోని ఓ ప్రముఖ నటుడు, రాజకీయాల గురించి పూర్తి అవగాహన ఉన్న రజనీకాంత్, విజయవాడకు వచ్చి చంద్రబాబు నాయుడుని ఇంతగా పొగడటం వైసీపీకి ఎంత కంపరం కలిగిస్తుందో ఊహించుకోవచ్చు. పైగా రజనీకాంత్ చెప్పిన వాస్తవాలు కళ్ళ ముందే కనిపిస్తున్నాయి.
కనుక అప్పుడే మంత్రి అంబటి రాంబాబు మీడియా ముందుకు వచ్చి, రజనీకాంత్ ఎన్టీఆర్ మీద గౌరవంతో, బాలకృష్ణతో ఉన్న అనుబందం కారణంగానే ఈ సభకి వచ్చారు తప్ప చంద్రబాబు నాయుడు కోసం కాదని గట్టిగా నొక్కి చెప్పి తన కడుపు మంట చల్లార్చుకొన్నారు. అయితే రజనీకాంత్ చంద్రబాబు నాయుడు దూరదృష్టిగలవారంటూ పొగిడిన విషయాన్ని ప్రస్తావించకుండా చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్కు ద్రోహం చేసారంటూ మళ్ళీ పాచిపోయిన పాట పాటనే పాడారు.
చంద్రబాబు నాయుడుని పొగిడితే వైసీపీ ప్రభుత్వం తన పేరును కూడా బ్లాక్ లిస్టులో పెట్టేసి తన జైలర్ సినిమాకు చుక్కలు చూపించడం ఖాయమని రజనీకాంత్కు తెలుసు. బహుశః అందుకే “రాజకీయాలు మాట్లాడొద్దురా రజనీ… అని అనుభవం చెపుతోందని” రజనీకాంత్ అన్నారనుకోవచ్చు.



