హిందూపురం వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ నగ్న వీడియో వ్యవహారంపై ఆ పార్టీలో నేతలెవరూ మీడియా ముందుకు వచ్చి మాట్లాడలేకపోతుండటం గమనిస్తే వారు కూడా తమ ఎంపీ రసికత చూసి షాక్ అయ్యారని అర్దమవుతూనే ఉంది. సజ్జల రామకృష్ణారెడ్డి ఒక్కరే మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతున్నా ఆయన మాట్లాడుతున్న మాటలు గోరంట్ల వీడియో కన్నా అశ్లీలంగా ఉండటం విశేషం. “గోరంట్ల మాధవ్ ఎవరినీ రేప్ లేదా మరేదో చేయలేదు కదా? అటువంటిదేదైనా చేసి ఉంటే వెంటనే చట్ట ప్రకారం చర్యలు తీసుకొని ఉండేవాళ్ళం. ఆయన ఓ గదిలో ఒక్కడే ఏదో చేస్తే దానిలో జుగుప్సాకరంగా ఉన్నది తనది కాదని ఆయన అంటున్నారు. దానిపై పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. అంతవరకు అందరూ ఓపిక పట్టాలి. ఇదేమంత సీరియస్ కేసు కాదు. దీనికంటే పెద్ద కేసులు చాలానే ఉన్నాయి కనుక కంగారూ పడితే కుదరదు,” అని అన్నారు.
ఈ వ్యవహారం బయటకు పొక్కినప్పుడు అలవాటు ప్రకారం వైసీపీ వెంటనే ఇది టిడిపి కుట్ర అంటూ కొంతమంది పేర్లు ప్రకటించేసింది. పోలీసులు దర్యాప్తు జరిపితే కానీ గోరంట్ల వీడియో అసలైనదా నకిలీదా తేలదని ఓ పక్క చెపుతూనే, మరోపక్క టిడిపీకి చెందినవారే ఈ కుట్ర చేశారని వైసీపీ నేతలు ఆరోపించడం గమనిస్తే, వారి ఆరోపణలలో పస లేదని అర్దమవుతూనే ఉంది. “ఒకవేళ టిడిపికి చెందినవారే ఈ కుట్ర చేసి ఉంటే పోలీసులు వారిపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు? మీ ప్రభుత్వమే అధికారంలో ఉంది కదా?” అని వంగలపూడి అనిత ప్రశ్న చాలా ఆలోచింపదగ్గది. దానికీ జగన్ ప్రభుత్వం వద్ద సమాధానం లేదు.
ఒకవేళ ఈ వ్యవహారంలో టిడిపి ప్రమేయం ఉండి ఉంటే టిడిపి నేతలు ఇంత చురుకుగా, ధైర్యంగా గోరంట్ల మాధవ్ నగ్న వీడియో వ్యవహారంపై మాట్లాడేవారు కారు కదా?కానీ గోరంట్ల మాధవ్పై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వంపై గట్టిగా ఒత్తిడి చేస్తున్నారంటే అర్దం ఏమిటి? చివరికి లోక్సభ స్పీకరుకి కూడా ఫిర్యాదు చేశారంటే అర్దం ఏమిటి? ఈ వ్యవహారంలో టిడిపి ప్రమేయం లేదనే కదా?
“గోరంట్ల మాధవ్పై చర్యలు తీసుకొంటే అది అక్కడితో ఆగదని వైసీపీలో మిగిలినవారిపై కూడా చర్యలు తీసుకోవాలని లేకుంటే వారి భాగోతాలు బయటపెడతానని అతను వైసీపీని బ్లాక్ మెయిల్ చేస్తాడని టిడిపి ఎంపీ కింజారపు రామ్మోహన్ నాయుడు అభిప్రాయం వ్యక్తం చేశారు. ఒకవేళ జగన్ ప్రభుత్వం ధైర్యం చేసి అతనిపై చర్యలు తీసుకోదలిస్తే పార్టీలో సగం మందిపై చర్యలు తీసుకోవలసి వస్తుందని అప్పుడు వైసీపీ పూర్తిగా ఖాళీ అయిపోతుందని అన్నారు. బహుశః అందుకే సిఎం జగన్మోహన్ రెడ్డి ఇంతవరకు అతనిపై ఎటువంటి చర్యలు తీసుకోలేదని కింజారపు రామ్మోహన్ నాయుడు అభిప్రాయం వ్యక్తం చేశారు. జగన్ ప్రభుత్వం ఎలాగూ అతనిపై చర్యలు తీసుకోలేదు కనుక తాను టిడిపి తరపున లోక్సభ స్పీకరుకి ఫిర్యాదు చేశానని కింజారపు రామ్మోహన్ నాయుడు తెలిపారు.



