మాస్ మహారాజా రవితేజ గోపీచంద్ మలినేని కాంబినేషన్ లో వస్తున్న తాజా చిత్రానికి క్రాక్ గా నామకరణం చేశారు. ఈ చిత్రం షూటింగ్ ఇప్పటికే సగానికి పైగా పూర్తి అయ్యింది. ఈ సినిమాలో రవితేజ సరసన శృతి హాసన్ నటిస్తోంది. మరోవైపు తమిళ నటి వరలక్ష్మి శరత్ కుమార్ ఈ సినిమాలో ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తోంది.
ఈరోజు రవితేజ పుట్టినరోజు సందర్భంగా మే 8న వేసవి కానుకగా సినిమా విడుదల కాబోతుందని నిర్మాతలు ప్రకటించారు. ఠాగూర్ మధు నిర్మిస్తున్న ఈ చిత్రానికి తమన్ సంగీతాన్ని అందిస్తున్నారు. హీరోగా రవితేజకు ఇది 66వ సినిమా. ఇందులో మాస్ రాజా మరోసారి పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్నాడు.
కొన్ని యదార్ధ సంఘటనల ఆధారంగా ఈ సినిమా కథను తయారు చేశాం అని చిత్రబృందం ప్రకటించింది. ఇది ఇలా ఉండగా ఇటీవలే విడుదలైన డిస్కో రాజాతో రవితేజ మరో ప్లాప్ ని మూటగట్టుకున్నాడు. వరుస ప్లాపులతో సతమతం అవుతున్న హీరోకు క్రాక్ చాలా కీలకం కాబోతుంది.
రవితేజ గోపీచంద్ మలినేని కాంబినేషన్ లో వచ్చిన డాన్ శీను, బలుపు సినిమాలు హిట్ కావడంతో ఈ సినిమా మీద అభిమానులు భారీగా అంచనాలు పెట్టుకున్నారు. మరి రవితేజ ఏం చేస్తారో చూడాలి. ఇది ఇలా ఉండగా రాక్షసుడుతో ఇటీవలే హిట్ కొట్టిన రమేష్ వర్మతో ఇంకో సినిమా చెయ్యబోతున్నట్టు రవితేజ ప్రకటించారు. గతంలో వారిద్దరూ వీర అనే ప్లాప్ సినిమా చేశారు.



