అందరికీ మొబైల్ వినియోగం అందుబాటులో ఉండాలనే లక్ష్యంతో దేశమంతా 500 రూపాయలకే మొబైల్ ను అందించిన ఘనత రిలయన్స్ సంస్థది. అప్పట్లో భారీ మొత్తాలలో ఉండే మొబైల్ ధరలకు చుక్కలు చూపిస్తూ విడుదల చేసిన ఈ ఫోన్ ‘సూపర్ సక్సెస్’ అయిన సంగతి టెక్ ప్రియులకు తెలిసిందే. అయితే కొన్ని చోట్ల దీనిని దుర్వినియోగం చేసారన్న ఆరోపణలు ఉన్నప్పటికీ, రిలయన్స్ ఇచ్చిన ఈ 500 రూపాయల మొబైల్ ఇండియాలోనే ఒక సంచలనం.
తాజాగా మరోసారి అలాంటి సంచలనానికే రిలయన్స్ నాంది పలకబోతోంది అని టెలికాం ఇండస్ట్రీ వర్గాలు చెప్తున్నాయి. ఇప్పటికే ‘జియో’ సిమ్ తో మార్కెట్ వర్గాల్లో ప్రకంపనలు సృష్టించిన రిలయన్స్, ఈ ఏడాది చివరి నాటికి కేవలం 1000 రూపాయలకే ‘వోల్ట్’ టెక్నాలజీ సపోర్ట్ చేసే స్మార్ట్ ఫోన్ లను అందుబాటులోకి తీసుకురానుందని టాక్. ప్రస్తుతం ఉచితంగా ఇస్తున్న ‘జియో’ సిమ్ ను అన్ని 4జీ మొబైల్స్ లో వినియోగించుకునే అవకాశం లేదు. కేవలం ‘వోల్ట్’ పరిజ్ఞానం కలిగిన మొబైల్స్ లో మాత్రమే డేటా మరియు కాల్స్ కు వినియోగించుకోవచ్చు.
దీంతో కొంతమేరకు జియో సిమ్ లకు ఇక్కడ బ్రేక్ పడుతోంది. ఈ ఒరవడిని జియో కొనసాగించాలంటే, ‘వోల్ట్’ సపోర్ట్ చేసే మొబైల్స్ ను అతి తక్కువ ధరలోకి అందుబాటులోకి తీసుకువస్తే, జియో సిమ్ తో పాటు ఈ మొబైల్స్ అమ్మకాలు కూడా పెంచుకోవచ్చనే ప్రతిపాదనలు చేస్తోందట. ఇదే గనుక కార్యరూపం దాలిస్తే… ఇండియన్ మార్కెట్ లో జియో మరోసారి పెను ప్రకంపనలను సృష్టిస్తుందన్న అంచనాలు ఊపందుకుంటున్నాయి. ముఖ్యంగా 2జీ నెట్ వర్క్ తో సరిపెట్టుకుంటున్న గ్రామీణ ప్రాంతాల్లో రిలయన్స్ జియో హవా కొనసాగిస్తుందని నిపుణుల అభిప్రాయం. ఈ ఏడాది చివర్లో విడుదల చేసి, వచ్చే ఏడాదికల్లా మార్కెట్ లోకి అందుబాటులోకి తీసుకువచ్చే ప్లాన్ లో ఉన్నట్లుగా సమాచారం.


