ప్రభుత్వ భవనాలకు వైఎస్సార్ కాంగ్రెస్ రంగులు వేసుకునే వెసులుబాటు కోసం ఉన్న అన్ని లీగల్ ఆప్షన్స్ ఉపయోగించిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇక లాభం లేదని దిగివచ్చింది. సచివాలయ భవనాలకు వైసీపీ రంగులను తొలగించి తెల్లరంగు వేయాలని అన్ని జిల్లాలకు ఆదేశాలు వెళ్లాయి.
నాలుగు వారాలలో తొలగించకపోతే కోర్టు ధిక్కారణ గా పరిగణిస్తామని సుప్రీం కోర్టు చెప్పింది. దీనితో అధికారులు హుటాహుటిన కదిలారు. ఇప్పటివరకు మౌఖిక ఆదేశాలు మాత్రమే అందాయని, వారం రోజుల్లోగా అన్ని సచివాలయాలకు రంగు మార్చేందుకు ప్రయత్నిస్తున్నామని అధికారులు చెబుతున్నారు.
అయితే సచివాలయాలకు మాత్రమే రంగులు తొలగించాలా లేక మిగిలిన ప్రభుత్వ భవనాలకు కూడా మార్చాలా అనేదాని మీద క్లారిటీ లేదని అంటున్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే వైఎస్సార్ కాంగ్రెస్ రంగులు వెయ్యడానికి 1300 కోట్లు ఖర్చుపెట్టారు. మధ్యలో ఇంకో రంగు కలపడానికి తాజాగా తెల్ల రంగు వెయ్యడానికి మొత్తంగా 1500 నుండి 1600 కోట్ల దాకా ఖర్చు అవుతుందని అంటున్నారు.
ప్రతిపక్షాలు మాత్రం ఈ ఖర్చుని వైఎస్సార్ కాంగ్రెస్ ఖాతా నుండే రాబట్టాలని డిమాండ్ చేస్తున్నారు. ఏది ఏమైనా అనవసరంగా ఈ విషయంలో ఈగోకి పోయి ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పరువు పోగొట్టుకున్నారు అనే చెప్పుకోవాలి.





