రేవంత్ రెడ్డి మోడీ పై చేసిన ప్రసంగానికి గాను బిఆర్ఎస్ పార్టీ నుండి కౌంటర్లు మొదలయ్యాయి. తెలంగాణ ఆత్మ లేదు…తెలంగాణ గౌరవం లేదు అంటూ మాజీ ఐటీ మంత్రి కేటీఆర్ రేవంత్ ను ఉద్దేశించి తన X లో స్పందించారు. దీనికి ప్రతిగా ఈరోజు మహబూబ్ నగర్ జిల్లాలో జరుగుతున్న పాలమూరు ప్రజాదీవెన సభలో రేవంత్ బిఆర్ఎస్ నాయకుల పై ఎదురుదాడి చేసారు.
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య స్నేహపూర్వకమైన వాతావరణం ఉండడానికి నావంతు బాధ్యతగా దేశ ప్రధానిగా మన రాష్ట్రానికి వచ్చిన అతిధి మోడీని మర్యాద పూర్వకంగా కలిసిన నా పై కొందరు విమర్శలు చేస్తున్నారు. నేను వారిమాదిరి నాలుగు గోడల మధ్య మోడీ గారి కాళ్ళు మీద మోకరిల్లలేదు. మోడీ కడుపులో తలకాయ పెట్టలేదు. చెవుల్లో గుససలాడలేదు.
తెలంగాణ ప్రజల సమక్షంలో రాష్ట్రానికి కేంద్రం నుండి రావాల్సిన నిధుల గురించి, రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం చేయాల్సిన పనుల గురించి అడగడం జరిగింది. రాష్ట్ర అభివృద్ధి కోసం మోడీ తో అయినా కేడితో అయినా కొట్లాడుతా. అంతేకాని మీ మాదిరి పక్క రాష్ట్రానికి వెళ్లి పులుసు తిని రాష్ట్ర వాటాను వదులుకోను అంటూ కేసీఆర్ కు తనదైన స్టైల్ లో చురకలు వేశారు రేవంత్.
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఘర్షణ వాతావరణం ఏర్పడితే సమస్యల పరిష్కారం అసాధ్యం. మోడీ గుజరాత్ ను ఎలా అయితే అభివృద్ధి చేసారో అలాగే తెలంగాణను కూడా అభివృద్ధి చేయడానికి కేంద్ర సహాయం అడగడం తప్పా..? గడిచిన దశాబ్దం నుంచి అధికారంలో ఉండి కూడా విభజన హామీలు నెరవేర్చలేని బిఆర్ఎస్ నాయకులు ఇప్పుడొచ్చి ఏదో రాష్ట్రానికి అన్యాయం జరిగిపోతుంది అంటూ ట్వీట్లు వేయడం హాస్యాస్పదం అంటూ బిఆర్ఎస్ నాయకులను సన్నాసులతో పోల్చారు ముఖ్యమంత్రి రేవంత్.




