తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించడంతో అటు ప్రత్యర్థి రాజకీయ పార్టీలతో పాటు సొంత పార్టీ నేతలు కూడా అవాక్కయ్యారనే చెప్పాలి. రాష్ట్రంలో రాదనుకున్న అధికారం కాంగ్రెస్ పార్టీ చేతికి వచ్చింది. అలాగే వస్తుందా? రాదా? అనుకున్న ముఖ్యమంత్రి పదవి రేవంత్ రెడ్డి ని వరించింది.దీనితో “రాష్ట్రంలో కాంగ్రెస్ గెలిచింది..సొంత పార్టీలో రేవంత్ గెలిచాడు” అంటూ రేవంత్ అభిమానులు సంబరాలు మొదలుపెట్టారు.
రెండు రోజుల ఉత్కంఠకు తెరదింపుతూ కాంగ్రెస్ అధిష్టానం రాష్ట్ర ముఖ్యమంత్రి అభ్యర్థి పేరుని ప్రకటించింది.నిన్న జరిగిన సీఎల్పీ సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే లు అందరు రేవంత్ రెడ్డిని సీఎల్పీ నేతగా ఎన్నుకోవడం జరిగింది. నాయకుల నిర్ణయాన్ని బలపరుస్తూ పార్టీ కూడా అధిష్టానం రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఖరారుచేశారు అంటూ ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసి వేణుగోపాల్ ప్రకటించారు.
ఈ నెల 7 గురువారం సీఎం గా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం ఉంటుందని స్పష్టం చేశారు వేణుగోపాల్.మొత్తానికి పార్టీని విజయం దిశగా నడిపించిన రేవంత్ కష్టానికి కాంగ్రెస్ పార్టీ తగిన గుర్తింపు ఇచ్చిందంటూ ఆనందపడుతున్నారు రేవంత్ వర్గీయులు. కాంగ్రెస్ పార్టీ చరిత్రలోనే అధిష్టానం తీసుకున్న సంచలన నిర్ణయాలలో ఇది ఒకటిగా నిలుస్తుంది. మొదటిసారిగా “సీనియారిటీకి కాకుండా సిన్సియారిటీకి పట్టం కట్టారు” కాంగ్రెస్ అధిష్టానం అన్న వ్యాఖ్యలు సర్వత్రా వినిపిస్తున్నాయి.




