ఏపీ సిఎం జగన్మోహన్ రెడ్డి బటన్ నొక్కుడు సభలలో ఏమి మాట్లాడుతారో, ఆయన మంత్రులు మీడియా ముందుకు వస్తే ఏమి మాట్లాడుతారో ప్రజలందరికీ తెలుసు.
ముఖ్యంగా ఏపీ మంత్రులలో ఎవరైనా తమ శాఖలలో జరుగుతున్న పనుల గురించి సమీక్షా సమావేశాలైన నిర్వహిస్తున్నారో లేదో? అసలు వారికి జగన్ ఆ అవకాశమే ఇవ్వనప్పుడు వారు అంత సాహసం ఎలా చేయగలరు? అని సర్ధిచెప్పుకోవలసి ఉంటుంది.
బహుశః అందుకే వారు మీడియా ముందుకు వచ్చినప్పుడు తమ శాఖల గురించి కాకుండా చంద్రబాబు నాయుడు, దగ్గుబాటి పురందేశ్వరి పవన్ కళ్యాణ్- మూడు పెళ్ళిళ్ళు, టిడిపి, జనసేనల పొత్తులు వంటి ఈజీ టాపిక్స్ గురించి అనర్గళంగా మాట్లాడేస్తుంటారనుకోవచ్చు.
కానీ తెలంగాణలో కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వంలో సిఎం రేవంత్ రెడ్డి తన మంత్రులకు పూర్తి స్వేచ్ఛనివ్వడంతో వారే తమ తమ శాఖలను నిర్వహించుకొంటూ, సొంతంగా నిర్ణయాలు తీసుకొంటున్నారు. గతంలో కేసీఆర్ కానీ, ఇప్పుడు ఏపీలో జగన్మోహన్ రెడ్డి కానీ తమ మంత్రులకు ఇంత స్వేచ్చ ఇవ్వకపోవడం వలన మంత్రులందరూ నిమిత్తమాత్రులుగానే ఉండిపోయారనే విషయం అందరికీ తెలుసు.
జగన్ తన మంత్రులకు స్వేచ్ఛగా పనిచేసుకొనే అవకాశం ఈయకుండా, రెండేళ్ళు పూర్తికాగానే వారి ‘పనితీరు బాగోలేదని’ పీకి పడేసి కొత్తవారిని నియమించుకొన్నారు! ఇప్పుడు ఎన్నికలు దగ్గరపడుతుంటే మంత్రులతో పాటు అనేకమంది ఎమ్మెల్యేల పనితీరు కూడా బాగోలేదని పక్కన పెట్టేయబోతుండటంతో వారు కూడా షాక్ అవుతున్నారు.
అందరినీ కలుపుకు వెళితేనే ఏ ప్రభుత్వమైన సమర్ధంగా పనిచేస్తుంది అని రేవంత్ రెడ్డి నిరూపించి చూపబోతుంటే, జగన్మోహన్ రెడ్డి అందుకు పూర్తి భిన్నంగా ఎవరినీ పనిచేయనీయకుండా చేసి, వారి పనితీరు బాగోలేదని పక్కన పెట్టేస్తూనే మళ్ళీ ‘నువ్వే మా నమ్మకం జగన్’ అని వారి చేతే చెప్పించుకొంటున్నారు కూడా! భలే ఉంది కదా?




