ఇంతకాలం ‘తెలంగాణ సెంటిమెంట్’ బిఆర్ఎస్ పార్టీకి మాత్రమే సొంతం. ఇంతకాలం అదొక్కటే వాడుకునేది. ఏటిఎం నుంచి డబ్బు డ్రా చేసి తీసుకున్నట్లు బిఆర్ఎస్ పార్టీ ఎన్నికల సమయంలో తెలంగాణ సెంటిమెంట్ బయటకు తీసి వాడేసుకునేది. కానీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా ‘తెలంగాణ సెంటిమెంట్’ను ఎడాపెడా వాడేసుకుంటోంది.
మళ్ళీ కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే రిజర్వేషన్లు రద్దు చేస్తుందని సిఎం రేవంత్ రెడ్డి వాదిస్తున్నారు. ఇలా మాట్లాడినందుకు మోడీ, అమిత్ షా ఇద్దరూ తనపై కక్ష కట్టి ఢిల్లీ పోలీసుల చేత తనపై కేసు నమోదు చేయించారని, తనను అరెస్ట్ చేయించాలని కుట్ర పన్నుతున్నారని రేవంత్ రెడ్డి ఆరోపిస్తున్నారు.
ఇద్దరు గుజరాతీలు తెలంగాణ గడ్డ మీద నిలబడి తన గురించి చాలా చులకనగా మాట్లాడి, తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని దెబ్బ తీశారని రేవంత్ రెడ్డి ఆరోపించారు. తెలంగాణ కోసం తాను మోడీ, అమిత్ షాలతో పోరాడేందుకు అవసరమైతే జైలుకి వెళ్ళేందుకు కూడా వెనకాడనని రేవంత్ రెడ్డి అన్నారు.
కేసీఆర్, మోడీ ఇద్దరూ కలిసి తెలంగాణ ప్రజలు ఎన్నుకున్న తన ప్రభుత్వాన్ని కూలద్రోయాలని కుట్రలు చేస్తున్నారని రేవంత్ రెడ్డి ఆరోపిస్తున్నారు.
రిజర్వేషన్ల అంశం కంటే రేవంత్ రెడ్డి చెపుతున్న ఈ కేసు, అరెస్టు, జైలు పదాలతోనే ప్రజలు బాగా కనెక్ట్ అవుతారని వేరే చెప్పక్కర లేదు. అందుకే రేవంత్ రెడ్డి తన ఎన్నికల ప్రచారంలో కేంద్రం నుంచి తనకు ప్రమాదం పొంచి ఉందని చెప్పుకుంటున్నారు.
రేవంత్ రెడ్డి రిజర్వేషన్లు పేరుతో సెంటిమెంట్ రాజేసి ఎన్నికలలో లబ్ధి పొందేందుకు ప్రయత్నిస్తున్నారని బిఆర్ఎస్ నేతలు కూడా ఆరోపిస్తున్నారు. ఈ ఎన్నికలలో బిఆర్ఎస్ పార్టీని దెబ్బ తీసేందుకే మోడీ-రేవంత్ రెడ్డి కలిసి ఈ కొత్త డ్రామా మొదలుపెట్టారని ఆరోపిస్తున్నారు.
అయితే తమకు మాత్రమే పేటెంట్ హక్కు కలిగిన తెలంగాణ సెంటిమెంట్ అస్త్రాన్ని రేవంత్ రెడ్డి కూడా వాడేసుకుంటున్నా కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు ఎవరూ కూడా రిజర్వేషన్ల రద్దు గురించి నోరు మెదపడం లేదు. బహుశః కల్వకుంట్ల కవిత కోసమే మౌనం వహిస్తున్నారేమో?
రేవంత్ రెడ్డి కూడా తెలంగాణ సెంటిమెంట్ వాడేసుకోవడం చూస్తే అదో ఊట బావి వంటిది… తోడుకున్నవారికి తోడుకున్నంత తెలంగాణ సెంటిమెంట్ అని అనుకోవాలేమో?




