రెండుసార్లు తెలంగాణ ముఖ్యమంత్రిగా చేసిన కేసీఆర్ ఎన్నికలలో ఓడిపోగా, ఆయన చేతిలో పలు అవమానాలకు గురైన రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు.
ఓటుకి నోటు కేసులో రేవంత్ రెడ్డిని ట్రాప్ చేసి జైలుకి పంపించి ఆయన రాజకీయ జీవితంలో ఎన్నటికీ మాయని మచ్చగా మిగిల్చారు కేసీఆర్. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రేవంత్ రెడ్డిని, కాంగ్రెస్ నేతలను, వారి పార్టీని, అధిష్టానాన్ని, చివరికి దివంగత ప్రధానులు నెహ్రూ, ఇందిరా గాంధీల గురించి కూడా నోటికి వచ్చిన్నట్లు మాట్లాడారు. రేవంత్ రెడ్డి శాసనసభ సమావేశానికి వస్తే సభ నుంచి బహిష్కరింపజేసేవారు.
ఎంతో రాజకీయ అనుభవం, లోకజ్ఞానం ఉన్న కేసీఆర్ ఈవిదంగా వ్యవహరిస్తే, ఆయన ఎంతగా అవమానించినప్పటికీ, రాజకీయంగా ఎంతగా దెబ్బ తీసినప్పటికీ, తన చేతిలో కేసీఆర్ ఓడిపోయినప్పటికీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన రేవంత్ రెడ్డి ఒక్క మాట తప్పుగా మాట్లాడలేదు. ఆయనని పరిహసించలేదు!
కేసీఆర్ తుంటి ఎముక విరిగి ఆస్పత్రిలో చేరితే, వైద్యపరంగా ఎటువంటి లోటు రానీయవద్దని సిఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. యశోదా ఆస్పత్రి వద్ద కేసీఆర్కు అదనపు భద్రత కల్పించారు. కేసీఆర్ త్వరగా కోలుకోవాలని ట్వీట్ చేయడమే కాకుండా ఈరోజు మధ్యాహ్నం సిఎం రేవంత్ రెడ్డి తన మంత్రులతో కలిసి యశోదా ఆస్పత్రికి వెళ్ళి కేసీఆర్ని పరామర్శించనున్నారు.
ఈ నేపధ్యంలో ఏపీ రాజకీయాలను ఓసారి చూస్తే, చంద్రబాబు నాయుడు అరెస్ట్, జైలు పాలైనప్పుడు ఏపీ సిఎం జగన్మోహన్ రెడ్డితో సహా ఆయన మంత్రులు, ఎమ్మెల్యేలు ఏవిదంగా మాట్లాడారో, ఎంత పరిహసించారో అందరూ చూశారు. “జైల్లో దోమలు, ఈగలు ఉండకపోతే రంభ, ఊర్వశీ ఉంటారా?” అంటూ ఓ వైసీపి ఎమ్మెల్యే మాట్లాడారు. అంతకు ముందు, ఆ తర్వాత నేటికీ కూడా వైసీపి నేతలు అనుచితమైన మాటలే మాట్లాడుతున్నారు కూడా. సిఎం రేవంత్ రెడ్డిని చూస్తున్నప్పుడు ఆ హుందాతనం మనకి ఎప్పటికైనా అబ్బుతుందా?అని అనిపించకమానదు.




