మద్యపానంలో మరో ముందడుగు: బార్ల వేలం ద్వారా రూ.597 కోట్లు ఆదాయం

Revenue of Rs 597 crores through auction of barsఆంధ్రప్రదేశ్‌లో వైసీపీ అధికారంలోకి వస్తే దశలవారీగా సంపూర్ణ మద్యపానం నిషేదం అమలుచేస్తానని జగన్మోహన్ రెడ్డి ఎన్నికలలో హామీ ఇచ్చారు. కానీ అధికారంలోకి వచ్చాక ప్రభుత్వమే మద్యం వ్యాపారంలో దిగింది. ఓసారి మద్యం ధరలు భారీగా పెంచేసి, మరోసారి ధరలు తగ్గించేసి భారీగా ఆదాయం సమకూర్చుకొంది. అంతేకాదు… ఏపీ బివరెజెస్ కార్పొరేషన్ పేరు చెప్పి వేలకోట్లు అప్పులు తెచ్చుకొంది.

ఈ మద్యం వ్యాపారంలో ఇప్పటివరకు తెర వెనుక ఉండి సంపాదించుకొన్న వైసీపీ నేతలు ఇప్పుడు బార్ల లైసెన్సుల వేలంపాటలో తమ అనుచరులు, బినామీల పేరుతో బార్లను దక్కించుకొన్నారు. శని,ఆదివారాలలో రెండు రోజులపాటు సాగిన ఈ వేలంపాటలో అత్యధికంగా వైసీపీ నేతలే దక్కించుకొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 838 బార్లు ఉండగా వాటిలో 815 బార్ల లైసెన్సుల కోసం వేలంపాట జరిగింది.

ADVERTISEMENT

తొలిరోజున వేలంపాటలో రూ.258 కోట్లు, రెండో రోజున నిన్న జరిగిన వేలంపాటలో రూ.339 కోట్లు కలిపి మొత్తం 597.35 కోట్లు ప్రభుత్వానికి ఆదాయం లభించింది. మిగిలిన 23 బార్లకు త్వరలోనే వేలంపాట నిర్వహిస్తారు. వాటి ద్వారా మరో రూ.20-25 కోట్లు ఆదాయం వస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఓ పక్క జగన్ ప్రభుత్వం మద్యం అమ్మకాలు, బార్లు, వైన్ షాపుల లైసెన్సుల వేలంపాట ద్వారా ఆదాయం సమకూర్చుకొంటుంటే, మద్యం వ్యాపారం ద్వారా వైసీపీ నేతలు భారీగా ఆదాయం సంపాదించుకొంటుండటం విశేషం.

తమ ఎన్నికల మ్యానిఫెస్టో ఖురాన్, బైబిల్, భగవద్గీత వంటిదని దానిలో పేర్కొన్న ప్రతీ హామీని అమలుచేసి తీరుతామని చెప్పిన సిఎం జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఏం చేస్తున్నారు? జగన్ ప్రభుత్వం, వైసీపీ నేతలు కలిసి మద్యం వ్యాపారాలు చేస్తూ మందుబాబుల కుటుంబాలను రోడ్డున పడేస్తూ సంక్షేమ పధకాలతో ప్రజల జీవితాలలో వెలుగులు నింపుతున్నామని గొప్పగా చెప్పుకోవడాన్ని ఏమనుకోవాలి?జగన్ చెప్పిన సంపూర్ణ మద్యపాన నిషేదం ఇదేనా? ఇలాగేనా అమలుచేసేది?

ADVERTISEMENT
Latest Stories