‘రాజకీయాల్లో ఉన్నంత వరకు కాంగ్రెస్ పార్టీతోనే ఉంటా… ఇక నుండి ఇలాంటి పుకార్లకు స్వస్తి పలకాలని’ మెగాస్టార్ చిరంజీవి కోరి మూడు రోజులు కూడా ముగియక ముందే, రాజకీయ, మీడియా వర్గాల్లో మరో వార్త హల్చల్ చేస్తోంది. ఈ సారి మెగాస్టార్ చూస్తోంది బిజెపి వైపు కాదు, జగన్ పార్టీ అయిన వైసీపీ వైపు అని ఈ కధనాల సారాంశం. దీనికి బ్యాక్ గ్రౌండ్ గా ఇటీవల చిరంజీవి నడిపిన పశ్చిమ గోదావరి జిల్లా పర్యటనను చెప్తున్నారు.
మెగాస్టార్ స్వగ్రామం అయిన మొగల్తూరు పర్యటన సందర్భంగా కాంగ్రెస్ పార్టీ వారి కంటే ఎక్కువగా వైసీపీ వర్గీయులే హల్చల్ చేసారని, బ్యానర్లు, ఫ్లెక్సీలు కూడా వైసీపీకి చెందినవే ఎక్కువగా ఉన్నాయని, చిరంజీవి నుండి సమాచారం అందుకున్న కొత్తపల్లి సుబ్బారాయుడు కూడా జగన్ పార్టీకి చెందిన నేతే అని… ఈ సందర్బంగా చిరుకు – వైసీపీ ఉన్న బంధాన్ని ప్రస్తావిస్తున్నారు.
కాంగ్రెస్ నేతలకు సమాచారం లేకుండా చిరంజీవి పర్యటన జరిపారని, దీనికి ‘కులం’ ముసుగు తీసుకురావడానికి కొత్తపల్లి సుబ్బారాయుడు వంటి వారికి ప్రాధాన్యత ఇవ్వడం, మెగాస్టార్ గారు జిల్లా పర్యటనకు రానున్నారనే విషయం సుబ్బారాయుడుకు ఒక వారం రోజులు ముందుగానే తెలియడం వంటి విషయాలన్నీ పరిగణనలోనికి తీసుకుని, ఈ వార్తలు పుట్టుకొచ్చాయి. దీనిపై కలత చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు అధిష్టానానికి ఒక ఫిర్యాదు చేసేందుకు కూడా సమాయత్తమవుతున్నారని తెలుస్తోంది.
మరి దీనిపై మెగాస్టార్ స్పందన ఏముంటుంది? పార్టీ మార్పుపై ఇప్పటికే ఒక ప్రకటన చేయడంతో, మరలా స్పందించే అవకాశాలు లేవు. అయితే స్పష్టమైన ప్రకటన చేసిన తర్వాత కూడా ఇలాంటి వార్తలు రావడంతో బ్యాక్ గ్రౌండ్ లో ఏదో జరుగుతుందన్న విషయం స్పష్టమవుతోంది. ఇంతకీ మెగాస్టార్ జగన్ వైపుకు చూసే అవకాశాలు ఉన్నాయంటారా..?





