ఇటు వైఎస్ షర్మిల, అటు సునీతా రెడ్డి ఇద్దరూ ఒకేసారి కూడబలుక్కున్నట్లు వివేకా హంతకుడు వైసీపి ఎంపీ అవినాష్ రెడ్డే అని, అతనిని తమ అన్న జగన్మోహన్ రెడ్డి కాపాడుకొస్తున్నారని, కానీ ఎందుకు అని అడిగితే జవాబు చెప్పడం లేదని సూటిగా ఆరోపణలు చేయడంతో వైసీపి నేతల్లో కలవరం మొదలైంది.
ఎందుకంటే ఆమె మాటల ప్రభావం కేవలం కడప లోక్సభ సీటుకి మాత్రమే పరిమితం కాబోదు. ఈ ప్రభావం రాష్ట్రమంతటా ఉంటుంది. శాసనసభ, లోక్సభ ఎన్నికలపై సమానంగా పడుతుంది.
వారిద్దరూ వైఎస్ కుటుంబానికే చెందినవారు కావడం, వారిలో షర్మిల ముఖ్యమంత్రి జగన్ సొంత చెల్లెలు కావడంతో ఆమె ఆరోపణలను ప్రజలు తప్పక నమ్ముతారు. అదే జరిగితే వైసీపి ఓటమికి వారిద్దరూ కూడా ప్రధాన కారణం అవుతారు.
కనుక వైసీపి తరపున న్యాయవాదిగా వాదించే సజ్జల రామకృష్ణా రెడ్డినేడు మీడియా ముందుకు వచ్చి వైఎస్ షర్మిలపై ఎదురుదాడి చేశారు.
“వైఎస్ షర్మిల ఓ పెయిడ్ ఆర్టిస్ట్ అని అందరికీ తెలుసు. ఆమె చెప్పాల్సిన సమాధానాలు, సంజాయిషీలు చాలానే ఉన్నాయి. వైఎస్ వివేకా హత్య జరిగి 5 ఏళ్ళయితే ఇంతకాలం ఆమె ఎందుకు మాట్లాడలేదు?ఇప్పుడే ఎందుకు మాట్లాడటం మొదలుపెట్టారు?
తెలంగాణలో రాజకీయాలు చేసుకుంటానని చెప్పి వెళ్ళిపోయిన వైఎస్ షర్మిల మళ్ళీ హటాత్తుగా ఎన్నికలకు ముందు ఏపీకి ఎందుకు తిరిగివచ్చేశారు?ఆమెకు ఏ అర్హతతో ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలుగా నియమించారు? ఆమెకు ఆ పదవి ఎవరు ఇప్పించారు?” అని సజ్జల ప్రశ్నించారు.
మరో నెలరోజులలో ఎలాగూ ఎన్నికలు జరుగబోతున్నాయని అప్పుడు ప్రజలే ఎవరు మంచివారో ఎవరు చెడ్డవారో తేల్చేస్తారని సజ్జల రామకృష్ణా రెడ్డి అన్నారు.
టిడిపి, జనసేన, బీజేపీల కూటమి గురించి మాట్లాడుతూ, “అది పేరుకే కూటమి కానీ దానిలో మూడు పార్టీలపై పెత్తనం చేసేది చంద్రబాబు నాయుడే. జనసేన, బీజేపీలలో తనకు నచ్చినవారికే ఆయన టికెట్లు ఇప్పించుకున్నారు. కానీ ఆయన ఇంకా ఎంతమందిని కూడగట్టుకొని వచ్చినా, ఎన్నికలలో వైసీపి భారీ మెజార్టీతో గెలువబోతోంది. ఈసారి టిడిపి సీట్లు ఇంకా తగ్గిపోవడం ఖాయం,” అని సజ్జల జోస్యం చెప్పారు.
“చంద్రబాబు నాయుడే పింఛన్లు అందకుండా అడ్డుపడ్డారని, కానీ తిరిగి మా ప్రభుత్వంపైనే కేంద్ర ఎన్నికల కమీషన్కు పిర్యాదులు చేస్తున్నారని అన్నారు. చంద్రబాబు నాయుడు 5 ఏళ్ళుగా ప్రతిపక్షంలోనే ఉన్నప్పటికీ ఇంకా తాను ముఖ్యమంత్రినన్నట్లే మాట్లాడుతున్నారు… వ్యవహరిస్తున్నారని,” సజ్జల రామకృష్ణా రెడ్డి ఆక్షేపించారు.
వైఎస్ షర్మిలపై ఎదురుదాడి చేసి నష్టనివారణ చేద్దామని ప్రయత్నించిన సజ్జల రామకృష్ణా రెడ్డి, అవినాష్ రెడ్డిని జగన్మోహన్ రెడ్డి ఎందుకు వెనకేసుకు వస్తున్నారు?అనే చెల్లెమ్మల సూటి ప్రశ్నకు జవాబు చెప్పకుండా తప్పించుకున్నారు.
టిడిపి కూడా కూటమిలో భాగస్వామి కనుక మూడు పార్టీలు గెలిచే అభ్యర్ధులకు టికెట్లు ఇవ్వాలనుకోవడం తప్పు కాదు. కానీ వాటితో సంబంధమే లేని వైసీపి నేతలు నర్సాపురం టికెట్ రఘురామ కృష్ణరాజుని బీజేపీలో చేరనీయకుండా, ఆయనకు టికెట్ దక్కకుండా చక్రం తిప్పడమే తప్పు.
వాలంటీర్లను దూరంగా ఉంచాలని కేంద్ర ఎన్నికల కమీషన్ మొదటి నుంచి హెచ్చరిస్తూనే ఉన్నప్పుడు, రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చాక వారి ద్వారా సంక్షేమ పధకాలే అమలుచేయలేనప్పుడు, పింఛన్లు చెల్లించడానికి వీల్లేదని జగన్ ప్రభుత్వానికి ముందే తెలుసు కదా?
తెలిసి ఉన్నప్పుడు సకాలంలో పింఛన్లు చెల్లించడానికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసి ఉండాలి కదా? కానీ ఎందుకు చేయలేదు? వృద్ధులకు వారి ఇళ్ళవద్దే పింఛన్లు చెల్లించాలని ఈసీ ఆదేశించినప్పటికీ వారిని సచివాలయాల చుట్టూ ఎందుకు తిప్పించింది?
ఎండలు తట్టుకోలేక 33 మంది వృద్ధులు చనిపోతే సానుభూతి చూపి వారి కుటుంబాలను ఆదుకోకుండా శవ రాజకీయాలు ఎందుకు చేస్తోంది?అనే చంద్రబాబు నాయుడు ప్రశ్నలకు కూడా సజ్జల రామకృష్ణా రెడ్డి సూటిగా సమాధానాలు చెపితే బాగుంటుంది.




