ఎన్డీయే ఉపరాష్ట్రపతి అభ్యర్ధి సీపీ రాధాకృష్ణన్కి వైసీపీ మద్దతు ప్రకటించడంతో అన్నని విమర్శించేందుకు చెల్లి షర్మిలకు మరో అవకాశం లభించింది. వైసీపీ ముసుగు తొలగి లోనున్న కాషాయ కండువా బయటపడిందని, బీజేపికి వైసీపీ బీ-టీమ్ అని నిర్ధారణ అయ్యిందని షర్మిల ట్వీట్ చేశారు.
అంతేకాదు… బీజేపికి ఆమె కొత్త నిర్వచనం చెప్పారు. బీజేపిలో ‘బి’ అంటే బాబు, ‘జే’ అంటే జగన్, ‘పీ’ అంటే పవన్ అని ముగ్గురూ మోడీకి తొత్తులే అని తెల్చిచేప్పేశారు. అయితే చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ బహిరంగంగా బీజేపితో చేతులు కలిపితే, జగన్ మాత్రం తెర వెనుక చేతులు కలుపుతుంటారని షర్మిల ఎద్దేవా చేశారు.
జగన్ అవినీతి కేసుల నుంచి తప్పించుకునేందుకు, గత 5 ఏళ్ళలో దోచుకొని దాచుకున్న సొమ్ముని కాపాడుకోవడానికే బీజేపికి జై కొట్టారని షర్మిల విమర్శించారు. ఇండియా కూటమి తెలుగువారైన సుదర్శన్ రెడ్డిని అభ్యర్ధిగా నిలబెడితే ఆయనకి మద్దతు ఈయకుండా ఆర్ఎస్ఎస్కు చెందిన సీపీ రాధాకృష్ణన్కి మద్దతు ఇస్తారా?” అంటూ షర్మిల సోషల్ మీడియాలో జగనన్న మీద నిప్పులు చెరిగారు.
కానీ కేసుల కారణంగానే తన అన్న ఇటువంటి నిర్ణయం తీసుకోవలసి వచ్చిందని ఆమె కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ విషయం అందరికీ తెలుసు.
కనుక ఆమె తెలంగాణ సిఎం రేవంత్ రెడ్డిని ఆదర్శంగా తీసుకొని పార్టీలు, రాజకీయాలకు అతీతంగ మద్దతు ఇవ్వాలని వైసీపీని కోరి ఉండి ఉంటే ఇప్పుడు ఆమె విమర్శలకు అర్ధం ఉండేది. కానీ మొక్కుబడిగా ఓ విజ్ఞప్తి చేసి విమర్శించడం వలన ఆమె వాదనలకు విలువ లేకుండా పోయింది.
రాష్ట్రంలో దళితులు, మైనార్టీలు వైసీపీని, జగన్ని నమ్ముకొని ప్రయోజనం లేదని, వారు వైసీపీకి కేవలం ఓటు బ్యాంక్ మాత్రమే అని నచ్చజెప్పి కాంగ్రెస్ వైపు ఆకర్షించేందుకు ఇదొక చక్కటి అవకాశం. కానీ ఆమె ఈ అవకాశాన్ని వృధా చేసుకొని చాలా తెలివిగా మాట్లాడుతున్నానని అనుకున్నారు.
కేసుల కారణంగా జగన్ ఈవిదంగా బీజేపితో చేతులు కలుపుతుంటారని మైనార్టీలకు తెలిసి ఉన్నప్పటికీ వారు జగన్నే నమ్ముకొని ఉన్నారు. కానీ వారిని కూడా షర్మిల ఆకర్షించ లేకపోతున్నారు. ఇది ఆమె వైఫల్యమే కదా?




