Singer Pravasthi Aradhya Allegations

తెలుగు టెలివిజన్‌లో సంగీత రియాలిటీ షోలు ఎప్పుడూ ఆకర్షణీయంగా ఉంటాయి. కానీ, ఇప్పుడు ‘పాడుతా తీయగా’ షో చుట్టూ కొత్త వివాదం చెలరేగింది. ఈ షోలో పాల్గొన్న గాయని ప్రవస్తి ఆరాధ్య, సంగీత లోకంలో దిగ్గజాలైన ఎం.ఎం. కీరవాణి, చంద్రబోస్, సునీతలపై సంచలన ఆరోపణలు చేసింది. ఈ ఆరోపణలు నిజమా? లేక, ఓటమి తట్టుకోలేని నాటకమా? అనేది తెలియాల్సి ఉంది.

సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అయింది. అందులో ప్రవస్తి, షోలో న్యాయనిర్ణేతలైన కీరవాణి, చంద్రబోస్, సునీతలు తనపై పక్షపాతం చూపారని, మానసికంగా వేధించారని ఆరోపించింది. కీరవాణి తన సొంత పాటలు పాడితేనే ఎక్కువ మార్కులు ఇచ్చారని, వివాహ వేడుకల్లో పాడే గాయకులపై “విముఖత” చూపారని ఆమె చెప్పింది. చంద్రబోస్ కూడా తన గీతాలు పాడని వారిని పట్టించుకోలేదని ఆమె వాదన. సునీత విషయంలో, ఆమె తనను తీవ్రంగా విమర్శించి, సరదాగా చేసిన వ్యాఖ్యలు తనను కలచివేశాయని ప్రవస్తి అన్నారు. అంతేకాదు, షో నిర్వాహకులు తనను “అసభ్యకరమైన” దుస్తులు ధరించమని, చీరను కిందకు కట్టమని ఒత్తిడి చేశారని కూడా ఆమె ఆరోపించింది.

Also Read – వైసీపీ నేతలందరూ ఇలా ప్రత్యక్షమయ్యారేమిటి?

అయితే, కట్టుబాట్లు పాటించే ఈ షోలో ఇలాంటి ఆరోపణలు నమ్మకం కలిగించేలా లేవు. ఈ ఆరోపణలపై గాయని సునీత స్పందించారు. ప్రవస్తితో తనకు గతంలో మంచి సంబంధం ఉందని, ఈ ఆరోపణలు తనను బాధించాయని అన్నారు. “నేను పక్షపాతం చూపినట్లయితే, ప్రవస్తిని నాతో కలిసి ఓ మ్యూజిక్ వీడియోలో ఎందుకు ఎంపిక చేసేదాన్ని?” అని అడిగారు. రియాలిటీ షోలు సంగీత హక్కులకు సంబంధించి చట్టబద్ధ నిబంధనలు పాటిస్తాయని, విమర్శలు వాస్తవాలపై ఆధారపడాలని ఆమె అన్నారు. “ఓటమిని గౌరవంగా స్వీకరించడం కూడా ఒక కళ. నా కెరీర్‌లో ఎన్నో సార్లు వైఫల్యాలు ఎదుర్కొన్నాను, కానీ ఎప్పుడూ నిగ్రహంతో ఉన్నాను,” అని సునీత ఉద్వేగంతో చెప్పారు.




సోషల్ మీడియా వేదికగా ఈ వివాదం గురించి రకరకాల అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు ప్రవస్తి ఓటమి తట్టుకోలేక ఈ ఆరోపణలు చేస్తోందని అంటున్నారు. మరికొందరు, ఎం.ఎం. కీరవాణి వంటి లెజెండ్‌ని ఇలాంటి చిన్న విషయాల్లో లాగడం సరికాదని వాదిస్తున్నారు. ఇదే అదునుగా చేసుకొని కీరవాణి మీద ఒక వర్గం వారు నిజానిజాలు తెలియకుండా అనవసర రాద్ధాంతం చేస్తున్నారు. అసలు నిజాలు బయటికి వస్తాయో లేదో వేచి చూడాలి.

Also Read – భారత్‌ క్షిపణు దాడులు నిజమే: ఒప్పేసుకున్నారు!