2023 తెలంగాణ ఎన్నికలు రాజకీయ పార్టీలకే కాదు ఓటేసే ప్రజలకు కూడా ఊహించని కొన్ని ట్విస్టులను ఇచ్చింది. ఒకే ప్రాంతంలో ఇద్దరు ముఖ్య నేతల మధ్య పోటీ, ఇద్దరు ప్రజలకు అత్యంత కీలకమైన నేతలే. ఎవరి వైపు నిలబడాలి, ఏపార్టీకి అండగా ఓటెయ్యాలి అనే ఆలోచనలో రెండు నియోగకవర్గాలలో ఓటర్లను అయోమయంలో పడేసారు నాయకులు.
ఆ నేతలు మరెవరో కాదు కేసీఆర్, రేవంత్, ఈటెల. ఆ నియోజకవర్గాలు మరేవో కాదు గజ్వేల్, కామారెడ్డి. ఈ రెండు ప్రాంతాల ప్రజలను సంకటంలో పడేసారు ఈ ముగ్గురు నేతలు. ఈ రెండు నియోజకవర్గాల గెలుపోటముల మీదే అందరి ఆసక్తి నెలకొంది. అయితే వీరంతా ఎన్నో సంవత్సరాల రాజకీయ అనుభవంతో ఉన్న రాజకీయ ఉద్దండులనే చెప్పాలి. అయితే వీరితో పాటుగా ఒకరకంగా చెప్పాలంటే సోషల్ మీడియాలో వీరికంటే ఎక్కువ ఫాలోయింగ్ సంపాదించుకున్నారు బర్రెలక్క అలియాస్ శిరీష.
కొల్లాపూర్ నుండి స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నికల బరిలో నిలిచారు ఈ బర్రెలక్క. ఎంత చదివినా గాని డిగ్రీల మెమోలు వస్తాయి గాని, జాబులు రాకపాయా. గద్దెనెక్కిన ప్రభుత్వాలు జాబ్ నోటిఫికేషన్ వెయ్యరు. అందుకనే బర్రెలను కొన్నా కనీసం వీటితో అయినా జీవనోపాధి పొందుతా అంటూ నిరుద్యోగుల బాధలను ప్రభుత్వానికి తెలిసొచ్చేలా, సామాన్యులకు అర్ధమయ్యేలా వీడియో చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు బర్రెలక్క. ఒక్క వీడియోతో తన తలరాత మారిపోయింది అన్నట్లుగా శిరీష బర్రెలక్కగా తెలంగాణ అంతటా ఫేమస్ అయ్యింది.
ఇక ఆ వీడియోతో సోషల్ మీడియాలో దుమ్ము రేపిన బర్రెలక్కకు అటుసామాన్యులలో ఫాలోయింగ్ తో పాటు ఇటు అధికార పార్టీ నుండి వేధింపులు ఎదురయ్యాయి. కలం కలిసొస్తే కర్ర కూడా పులా దందాగా మారుతుంది అన్నటు అధికార పార్టీ నేతల నుండి ఎదురైనా వేధింపులతో ఈమెకు మరికాస్త బలం పెరిగింది. ఆ బలం ఎంతలా పెరిగింది అంటే ఒక సామాన్య నిరుపేద దశాబ్దాల అనుభవం, కొన్ని వేల కోట్ల సంపద ఉన్న రాజకీయ పార్టీలను ఆయా పార్టీల నేతలను ఎదురించి స్వతంత్ర అభ్యర్థిగా, నిరుద్యోగుల గొంతుగా కొల్లాపూర్ నియోజకవర్గం నుండి పోటీకి సిద్దమయ్యింది.
అనుకున్నట్లే విజిల్ గుర్తు పై పోటీ చేసి రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలందరి దృష్టిని తన వైపు తిప్పుకోగలిగింది.కృషి, పట్టుదల, దైర్యం ఈ మూడు ఉంటే డబ్బుతో, అనుభవంతో పనిలేదని బర్రెలక్క నిరూపించింది. ఆమె ఎన్నికలలో గెలిచినా, ఓడినా గెలిచినట్టే లెక్క. అంతమంది నాయకులను ఎదిరించి ఏ రాజకీయ పార్టీ ప్రలోభానికి లొంగకుండా ఒక సామాన్య ఆడపిల్లగా ఈ స్థాయికి చేరుకోవడమే ఎంతో అభినందించదగ్గ విషయం.
దశాబ్దాల అనుభవం ఉన్న టీడీపీ పార్టీ కూడా అధినేత అందుబాటులో లేని కారణంగా పోటీ నుండి తప్పుకుంటున్నాం అంటూ ప్రకటించింది. అలాగే, మహానేత అని చెప్పుకునే తండ్రి రాజకీయ వారసత్వం ఉండి, వేల కోట్లు ఖర్చుపెట్టె స్తోమత ఉండి, సొంతగా పార్టీని స్థాపించి నడిపించగలిగిన ఆర్థిక బలం ఉండి, రాజకీయాలలో తనకంటూ స్వీయ అనుభవం ఉండి కూడా చివరి నిమిషంలో ఎన్నికల పోటీ నుంచి తప్పుకున్న వారితో పోలిస్తే బర్రెలక్క చాల అంటే చాల సమర్థురాలనే చెప్పాలి.
“బర్రెలు కొన్నా.. ప్రభుత్వాన్ని ప్రశ్నించినా..ఫేమస్ అయ్యినా..ఇప్పుడు ఎన్నికలలో పోటీ చేసినా…” అన్నట్టుగా శిరీష రాజకీయ ప్రస్థానం సాగింది. ఎమ్మెల్యే కప్పు గెలిచినా గెలవకున్న ఇప్పటికే తెలుగు ప్రజల హృదయాలను మాత్రం బర్రెలక్క గెలిచేసింది.




