చంద్రబాబు దార్శనికుడు కనుకే అమరావతికి నిధులు ఇచ్చింది: సోము వీర్రాజు

Somu Veerraju praises Chandrababu Naidu's  greatness ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు సోమూ వీర్రాజు తొలిసారిగా టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు గొప్పదనాన్ని తన నోటితోనే చెప్పారు.

శనివారం సాయంత్రం విజయవాడలోని పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ, “చంద్రబాబు నాయుడు మంచి ఆలోచన, దూరదృష్టి గలవారు కనుకనే కేంద్ర ప్రభుత్వం అమరావతి నిర్మాణ పనులకు రూ.8,500 కోట్లు ఇచ్చింది. కానీ జగన్‌కు ఆ దూరదృష్టి లేదు. రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకొందామనే ఆలోచనా లేదు. అందుకే కేంద్ర ప్రభుత్వం అమరావతి కోసం జగన్ ప్రభుత్వానికి నిధులు ఇవ్వడం లేదు.

ADVERTISEMENT

మూడు రాజధానులు అంటూ మూడేళ్ళు కబుర్లతో కాలక్షేపం చేశారు కానీ ఒక్క ఇటుక ముక్క పెట్టలేదు. చివరికి రాష్ట్రానికి రాజధాని లేకుండా చేశారు. అమరావతి కావాలనుకొంటే ప్రజలు ఆయనను గద్దె దింపి ఇంటికి సాగనంపక తప్పదు.

జగన్‌ ఎంతసేపు అధికారాన్ని అడ్డుపెట్టుకొని కోట్లు వెనకేసుకోవడం ఎలాగ అని మాత్రమే ఆలోచిస్తుంటారు. కేంద్ర ప్రభుత్వం పంచాయతీలకు ఇచ్చిన నిధులను కూడా దారి మళ్లిస్తున్నారు. కార్పొరేషన్లను అడ్డుపెట్టుకొని ఎడాపెడా అప్పులు చేస్తూ రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో ముంచేస్తున్నారు.

పోలవరం ప్రాజెక్టు కట్టలేమని అప్పగిస్తే కేంద్ర ప్రభుత్వమే ప్రాజెక్టును నిర్మించి ఇవ్వడానికి సిద్దంగా ఉంది. కానీ జగన్‌ దానిని అడ్డం పెట్టుకొని కోట్లు వెనకేసుకొందామని చూస్తున్నారు. అందుకే దానిని కేంద్రానికి అప్పగించడం లేదు. జగన్‌ రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలను మోసం చేస్తూనే ఉన్నారు. బిజెపి అమరావతి నిర్మాణానికి, రాష్ట్రాభివృద్ధికి కట్టుబడి ఉంది,” అని అన్నారు.

మూడేళ్ళుగా రాష్ట్రం పరిస్థితిని కళ్ళారా చూస్తూ కూడా బిజెపి, కేంద్ర ప్రభుత్వం రెండూ ఏనాడూ ఏపీని కాపాడే ప్రయత్నం చేయలేదు. పైగా జగన్ ప్రభుత్వం ఎడాపెడా అప్పులు చేస్తుంటే కేంద్ర ప్రభుత్వం నేటికీ ఆయనకి అన్నివిధాల సహకరిస్తూనే ఉంది.

ప్రధాని నరేంద్రమోడీ స్వయంగా శంకుస్థాపన చేసిన అమరావతిని జగన్‌ కాదని మూడు రాజధానులు అంటుంటే అభ్యంతరం చెప్పలేదు. అమరావతి నిర్మాణ పనులు కొనసాగించాలని ఏనాడూ ఒత్తిడి చేయలేదు. ఇప్పుడు ఎన్నికల దగ్గర పడుతున్నందున పాదయాత్రలు, బైక్ ర్యాలీలు చేస్తూ, జగన్ ప్రభుత్వాన్ని విమర్శిస్తే ఆంధ్రప్రదేశ్‌ ప్రజలు బిజెపికి ఓట్లేస్తారని అత్యాశకు పోతోంది.

రెండు తెలుగు రాష్ట్రాలలో అధికారంలోకి రావాలనే యావ తప్పితే రాష్ట్రాల పరిస్థితి, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు, వారి ఆకాంక్షలు బిజెపికి అక్కరలేదు. ఈవిదంగా వ్యవహరిస్తున్నప్పుడు ప్రజలు తమను ఎందుకు నమ్ముతారని రాష్ట్ర బిజెపి నేతలు ఆలోచిస్తున్నట్లు లేదు.

ఆంధ్రప్రదేశ్‌కు అన్యాయం చేసినందుకు ప్రజలు కాంగ్రెస్ పార్టీని కనబడకుండా తుడిచిపెట్టేశారు. కనుక ఆంధ్రప్రదేశ్‌ ప్రజలతో ఏ పార్టీ పొలిటికల్ గేమ్స్ ఆడే ప్రయత్నం చేసినా తగినవిదంగా బుద్ది చెపుతారని గ్రహిస్తే మంచిది.

ADVERTISEMENT
Latest Stories