ఈ మాటలన్నది మరెవరో కాదు. సాక్షాత్ ఆంధ్రప్రదేశ్‌ శాసనసభ స్పీకర్‌ తమ్మినేని సీతారాం! బ్లాక్ కమెండోల రక్షణ చూసుకొనే చంద్రబాబు నాయుడు రెచ్చిపోతున్నారని, ఆ రక్షణ తొలగిస్తే క్షణంలో ఆయన ఫినిష్ అయిపోతారని స్పీకర్‌ తమ్మినేని అన్నారు. అసలు చంద్రబాబు నాయుడుని జెడ్ ప్లస్ కేటగిరీ రక్షణ దేనికని ఆయన ప్రశ్నించారు. దేశంలో ప్రాణహాని ఉన్నవారు చాలామందే ఉన్నారని, వారందరికీ కేంద్ర ప్రభుత్వం రక్షణ కల్పించగలదా?వారికి కల్పించలేనప్పుడు చంద్రబాబు నాయుడుకి మాత్రం దేనికని స్పీకర్‌కు తమ్మినేని ప్రశ్నించారు. అసలు చంద్రబాబు నాయుడు జెడ్ ప్లస్ కేటగిరీ రక్షణకు ఏవిదంగా అర్హుడు?అని ప్రశ్నించారు. ఆయనకు జెడ్ ప్లస్ కేటగిరీ రక్షణ తొలగించాలని ఏపీ శాసనసభ స్పీకరుగా కేంద్రానికి విజ్ఞప్తి చేస్తున్నానన్నారు.

చంద్రబాబు నాయుడు మహానాడు సభలో మినీ ఎన్నికల మ్యానిఫెస్టోలో భాగంగా ‘భవిష్యత్తుకు గ్యారెంటీ’ పేరుతో కొన్ని హామీలు ప్రకటించారు. వాటిలో సంక్షేమ పధకాలు కూడా ఉన్నాయి. చంద్రబాబు నాయుడు సంక్షేమ పధకాలు అమలుచేయగలరా?ఆయన వస్తే ఉన్నవాటిని కూడా రద్దు చేసేస్తారంటూ ఇంతవరకు సవాళ్ళు విసిరిన వైసీపీ నేతలు, ఇప్పుడు “ఎలా ఇస్తాడు? ఇవ్వడు,” అంటూ కొత్త పల్లవి అందుకొన్నారు.

Also Read – వైసీపీ చేపల వేట ఫలించేనా?

అప్పటి నుంచే మంత్రులు, వైసీపీ ఎమ్మెల్యేలు అందరూ పోటాపోటీగా మీడియా సమావేశాలు ఏర్పాటు చేసి చంద్రబాబు నాయుడుని తీవ్రంగా విమర్శిస్తున్నారు. వారిలో స్పీకర్‌ తమ్మినేని సీతారాం కూడా ఉండటం ఆశ్చర్యం కాదు కానీ ఆ హోదాలో ఉన్న వ్యక్తి మాజీ ముఖ్యమంత్రి, రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్ష నాయకుడైన చంద్రబాబు నాయుడుని ఉద్దేశ్యించి “బ్లాక్ క్యాట్ కమెండో రక్షణ లేకపోతే ఫినిష్ అయిపోతారు,” అంటూ చేసిన సంచలన వ్యాఖ్యలు చేయడం దిగ్బ్రాంతి కలిగిస్తుంది. అసలు చంద్రబాబు నాయుడుకి రక్షణ తొలగించాలని స్పీకర్‌ తమ్మినేని ఎందుకు కోరుకొంటున్నారు?రక్షణ తొలగిస్తే ఫినిష్ అయిపోతారంటే అర్దం ఏమిటి?




ఇప్పటికే వైఎస్ వివేకానంద రెడ్డి హత్యకేసులో వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి పీకలలోతు మునిగి ఉన్నారు. సీబీఐ ఏ క్షణంలోనైనా అరెస్ట్‌ చేసే అవకాశాలున్నాయి. పైగా ఈ కేసులో ఇప్పుడు సీబీఐ సిఎం జగన్మోహన్ రెడ్డిని కూడా వేలెత్తి చూపుతోంది. ఇటువంటి సమయంలో స్పీకర్‌ హోదాలో ఉన్న తమ్మినేని సీతారాం, రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షనాయకుడిని ఉద్దేశ్యించి ఈవిదంగా మాట్లాడటంతో, “వైసీపీ ప్రభుత్వం చంద్రబాబు నాయుడుని కూడా అడ్డు తొలగించుకోవాలనుకొంటోందా?” అని టిడిపి నేతలు సందేహం వ్యక్తం చేస్తున్నారు. గతంలో కూడా వైసీపీ నేతలు చంద్రబాబు నాయుడు, నారా లోకేష్‌లను ఉద్దేశ్యించి ఇటువంటి బెదిరింపు వ్యాఖ్యలు చేశారు. కనుక స్పీకర్‌ వ్యాఖ్యలపై గవర్నర్‌ని కలిసి ఫిర్యాదు చేయాలని టిడిపి భావిస్తోంది.

Also Read – వైసీపీ గతం మూడు రాజధానులు, మరి భవిష్యత్.?