ఆంధ్రప్రదేశ్ రాజకీయ సమరానికి సమయం ఆసన్నమవుతోంది. దీంతో ప్రధాన పార్టీలైన టీడీపీ, వైసీపీలు గెలుపు గుర్రాల అన్వేషణలో బిజీగా ఉన్నారు. ఎన్నికల టైమ్ దగ్గరయ్యే కొద్ది పార్లమెంట్ అభ్యర్థుల కోసం పార్టీలు ఎవరి ప్లాన్స్తో వారు ముందుకు వెళుతున్నారు. పార్లమెంట్తో పాటు అసెంబ్లీ ఎన్నికలు కూడా ఏపీలో జరగనుండటం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. అలాగే పొలిటికల్ పార్టీలన్నీ ఎవరిని బరిలోకి దింపాలి.. ఎలాంటి వారిని ఎన్నుకుంటే ఓట్ల వేటలో విజయాన్ని సొంతం చేసుకుంటామనే ప్లానింగ్స్ వేసుకుంటున్నాయి. ఆ రీతిలోనే ముందుకు అడుగులు వేస్తున్నాయి.
టీడీపీ అధినేత చంద్రబాబు విషయానికి వస్తే ఈసారి ఎన్నికల్లో ఆయన మరింత జాగ్రత్తలు పాటించటమే కాకుండా ఆచితూచి అడగులు వేస్తున్నారు. గతంలో సీనియర్ ఎన్టీఆర్ పాటించిన ఎంపిక విధానాన్నే చంద్రబాబు ఫాలో అవుతున్నారని సమాచారం. అదేంటో తెలుసా.. ఆర్థికబలంతో పాటు సామాజిక స్పృహ ఉన్నవారిని ఎన్నికల పోటీలో అభ్యర్థులుగా ఎంపిక చేస్తే వారు గెలుపు వైపుగా అడుగులు వేయటం సులభతరం అవుతుంది. ఇంతకు ముందు గల్లా జయదేవ్ వంటి వారిని చంద్రబాబు ఇలాగే పోటీలోకి దింపి విజయాన్ని సొంతం చేసుకున్నారు.
ఇప్పుడు కూడా ఇదే వ్యూహంతో టీడీపీ అధినేత ఆలోచనలు చేస్తూ ముందుకు వెళుతున్నారు. ఏలూరు లేదా రాజమండ్రి, నర్సారావు పేట, గుంటూరు పార్లమెంట్ నియోజక వర్గాల్లో ఏదో ఒకదాన్ని యువ పారిశ్రామిక వేత్త కంచర్ల సుధాకర్కు కేటాయిస్తారనే వార్తలు గట్టిగా వినిపిస్తున్నాయి. కందుకూరు గ్రామానికి చెందిన సుధాకర్కి హెల్త్ కేర్ రంగంలో మంచి అనుభవం ఉంది. హెల్త్ కేర్ రంగంలో, పలు ఐటీ కంపెనీలు స్థాపించి యువకులకు ఉపాధి కల్పించటంలో కంచర్ల సుధాకర్ ముఖ్య భూమికను పోషించారు. ఇలాంటి వ్యక్తిని పార్లమెంట్ అభ్యర్థిగా బరిలోకి తీసుకొస్తే విజయాన్ని సులువుగా సొంతం చేసుకోవచ్చుననేది టీడీపీ అధినేత ఆలోచనగా కనిపిస్తుందని టాక్.
అందుకనే కంచర్ల సుధాకర్ పార్లమెంట్ అభ్యర్థిగా రంగంలోకి తీసుకు రావటానికి టీడీపీ యువనేత నారా లోకేష్ ఆలోచించి నిర్ణయం తీసుకోవటమే కాదు.. ఆయనతో టచ్లో ఉంటున్నారని సమాచారం. అయితే గుంటూరు, నర్సారావు పేట, ఏలూరు, రాజమండ్రిలలో ఎక్కడి నుంచి పోటీలోకి తీసుకు రావాలనే దానిపై చంద్రబాబు ఆలోచిస్తున్నారు. అలాగే కంచర్ల సుధాకర్ సైతం పార్లమెంట్ అభ్యర్థిగా బరిలోకి దిగటానికి తన సంసిద్ధతను వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఇప్పుడు ఆయన్ని ఏ నియోజక వర్గం నుంచి రంగంలోకి దించుతారనేది అందరిలోనూ ఆసక్తిని రేపుతోంది.






