ఇప్పటికే దేశంలో ప్రపంచంలో పలు సమస్యలు పేరుకుపోయున్నాయి. అవే ఎప్పటికి పరిష్కారం అవుతాయో తెలీని పరిస్థితి. ఇప్పుడు వాటికి తోడు ‘ఎల్నినో’ ప్రభావం కూడా ప్రభావం చూపుతోంది.
బంగాళాఖాతంలో అల్పపీడనం వాయుగుండంగా ఆ తర్వాత తుఫానుగా మారినట్లే, ఈ ఎల్నినో కూడా ‘సూపర్ ఎల్నినో’గా మారబోతోందని వాతావారణ శాస్త్రవేత్తలు హెచ్చరిక మరింత ఆందోళన కలిగిస్తోంది.
ఉగాదికి పంచాంగం చెప్పుకున్నపుడు అంతా బాగానే ఉందనుకున్నాము. కానీ 2026 ముగింపు మాత్రం సూపర్ ఎల్నినోతోనేనని వాతావారణ శాస్త్రవేత్తలు చెపుతున్న ఈ కొత్త జోస్యం జీర్ణించుకోవడం చాలా కష్టమే.
ఇప్పటికే పసిఫిక్ మహాసముద్రంలో సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు వేగంగా పెరుగుతుండటంతో.. ఈ ఏడాది నవంబర్, డిసెంబర్ నాటికి ఉష్ణోగ్రతలు గరిష్ఠ స్థాయికి చేరుకునే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. అక్టోబర్ నుంచి డిసెంబర్ మధ్య సూపర్ ఎల్నినో ఏర్పడే అవకాశం ఉందని అమెరికా వాతావరణ అంచనా సంస్థలు చెబుతున్నాయి.
ఇది 1950 తర్వాత నమోదైన అత్యంత బలమైన ఎల్నినోలను కూడా అధిగమించే అవకాశం ఉందని అంచనా. దీని ప్రభావంతో ప్రపంచవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు పెరగడంతో పాటు, కొన్ని ప్రాంతాల్లో కరువు, మరికొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు, వరదలు, అడవుల్లో మంటలు వంటి విపరీత వాతావరణ పరిస్థితులు ఏర్పడే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు.
ప్రపంచం సంగతి పక్కన పెట్టి దీని ప్రభావం భారత్ ఏవిధంగా ఉంటుందని ఆలోచిస్తే, అధిక వర్షపాతం వలన పంటలు పోతాయి. వర్షాభావ పరిస్థితులు ఏర్పడితే పంటలు పండవు,
వర్షాలు పడక ఉష్ణోగ్రతలు పెరిగితే భూగర్భ జలాలు ఇంకిపోతాయి. విద్యుత్ వాడకం గణనీయంగా పెరుగుతుంది. కనుక నీటి లభ్యత, ఆహార ఉత్పత్తి, రవాణా, విద్యుత్ రంగాలపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంటుంది.
ఇలాంటి విపరీత ప్రభావాలన్నీ అంతిమంగా సామాన్య, నిరుపేద ప్రజలపైనే పడతాయి. వారే కష్టనష్టాలు భరించాల్సి ఉంటుంది.
చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకొని ప్రయోజనం ఉండదు కనుక కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటి నుంచే అవసరమైన ముందస్తు జాగ్రత్తలు, చర్యలు చేపట్టడం మంచిది.




