అవినాష్ రెడ్డికు సుప్రీంకోర్టు నోటీస్… నో ప్రాబ్లెమ్!

YS-Avinash-Reddy_Supreme-Courtవివేకానందరెడ్డి హత్యకేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డికి సుప్రీంకోర్టు సోమవారం నోటీసు జారీ చేసింది. ఈ కేసులో ఆయనకు తెలంగాణ హైకోర్టు ముందస్తు బెయిల్‌ మంజూరు చేయడాన్ని సవాలు చేస్తూ సునీతా రెడ్డి సుప్రీంకోర్టులో పిటిషన్‌ వేశారు.

ADVERTISEMENT

దానిపై నేడు జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ ఎంఎం సుందరేష్‌లతో కూడిన సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనం విచారణ చేపట్టింది. ఈ కేసులో కౌంటర్ దాఖలు చేయాలని సీబీఐకి, అవినాష్ రెడ్డికి నోటీసులు జారీ చేసి ఈ కేసు తదుపరి విచారణను జూలై 3కి వాయిదా వేసింది. తదుపరి విచారణ చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ ధర్మాసనం చేపడుతుందని తెలియజేసింది.

దాదాపు నాలుగేళ్లుగా ఈ కేసు విచారణ కొనసాగుతుండటంపై ఇదివరకు సుప్రీంకోర్టే అసహనం వ్యక్తం చేస్తూ ఈ కేసు విచారణ చేస్తున్న సీబీఐ అధికారి రామ్ సింగ్‌ని మార్పించి, చౌరాసియాకు అప్పగించింది. జూన్ నెలాఖరులోగా ఈ కేసు విచారణ పూర్తి చేయాలని డెడ్ లైన్ కూడా సుప్రీంకోర్టే విధించింది. ఇదే విషయం సునీతారెడ్డి నేడు సుప్రీంకోర్టుకు తెలియజేసి అవినాష్ రెడ్డికి తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ముందస్తు బెయిల్‌ రద్దు చేయాలని ఆమె విజ్ఞప్తి చేశారు. కానీ సుప్రీంకోర్టు సీబీఐకి, అవినాష్ రెడ్డికి నోటీసులు జారీ చేసి ఈ కేసు తదుపరి విచారణను జూలై 3కి వాయిదా వేసింది!

ఈ కేసులో అవినాష్ రెడ్డికి ముందస్తు బెయిల్‌ రద్దు చేయాలని సునీతారెడ్డి కోరితే, సుప్రీంకోర్టే ఆయనకు మరో 15 రోజులు గడువు ఇవ్వడం విశేషం. ఈ కేసులో అవినాష్ రెడ్డి బయట ఉంటే సాక్షులను ప్రభావితం చేస్తారని కనుక ఆయనను అరెస్ట్‌ చేయకతప్పదని హైకోర్టులో వాదిస్తున్న సీబీఐ, ఆయనకు తెలంగాణ హైకోర్టు ముందస్తు బెయిల్‌ మంజూరు చేసినప్పుడు దానిని రద్దు చేయాలని కోరుతూ సుప్రీంకోర్టుకి వెళుతుందని అందరూ ఊహించారు. కానీ సీబీఐ వెళ్ళలేదు… సునీతారెడ్డి వెళ్ళారు!

ఆమె వెళ్ళారు కనుకనే 15 రోజుల తర్వాత సీబీఐ వెళ్ళవలసివస్తోంది లేకుంటే వెళ్ళి ఉండేది కాదేమో? సీబీఐ విచారణ జరుగుతున్న తీరు, వాటిపై న్యాయస్థానాలు స్పందిస్తున్న తీరు చూస్తున్నప్పుడు ఈ కేసు గురించి ఇక అవినాష్ రెడ్డి ఏమాత్రం ఆందోళన చెందాల్సిన అవసరం లేదనే భావించవచ్చు.

ADVERTISEMENT
Latest Stories