ఏపీలో ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున ఇప్పుడు జగన్ బటన్ నొక్కి డబ్బు పంచిపెట్టలేరు. కనుక మరో దారి చూసుకోవలసిందే. అలాంటి దారులు వైసీపికి చాలా తెలుసు. ఈసారి ఒంగోలు నుంచి లోక్సభకు పోటీ చేయబోతున్న చంద్రగిరి వైసీపి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి ఇంకా బాగా తెలుసు.
ఎన్నికలలో ఓటర్లకు పంచి పెట్టేందుకు జగన్మోహన్ రెడ్డి బొమ్మతో వైసీపి రంగులతో ముద్రించిన వాచీలు, గొడుగులు, సూట్ కేసులు, ప్రెషర్ కుక్కర్లు, పెద్ద స్పీకర్లు, క్రికెట్ సెట్లు, క్రీడా సామాగ్రి తదితర 52 రకాల బహుమతులను వేలాదిగా సిద్దం చేయించి రేణిగుంటలో పెద్ద గోదాములో దాచి పెట్టి ఉంచారు.
అయితే గోదాములోకి సరుకు తీసుకువచ్చి, తీసుకు వెళుతున్న లారీల హడావుడి పెరగడంతో స్థానిక టిడిపి నేతలకు అనుమానం కలిగి పోలీస్, రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేశారు. వారు ఉదయం 10 గంటలకు సమాచారం ఇస్తే సాయంత్రం 4-5 గంటలకు తాపీగా వచ్చి గోదాము తాళం చెవులు లేవంటూ తనికీలు చేయకుండా వెళ్ళిపోవాలని ప్రయత్నించారు. కానీ టిడిపి నేతలు గట్టిగా పట్టుబట్టడంతో రాత్రి 7-8 గంటలకు గోదాము తలుపులు తెరిచి చూడగా కోట్లాది రూపాయలు విలువగల బండిల్స్ కనబడ్డాయి.
అధికారులు రిజిస్టర్లో ఉన్న వివరాలను పరిశీలించగా రాయలసీమ జిల్లాలలో అన్ని ప్రాంతాలకు అక్కడి నుంచే తాయిలాలు రవాణా అవుతున్నాయని గ్రహించారు. టిడిపి నేతలు అక్కడే ఉండటంతో అధికారులకు గత్యంతరం లేక గోదాము స్వాధీనం చేసుకున్నారు.
సంక్షేమ పధకాలతో మేలు చేశాము కనుక ప్రజలు మనకే ఓట్లు వేస్తారని జగన్మోహన్ రెడ్డి నిత్యం చెప్పుకుంటునప్పటికీ, వాటితో ఓట్లు రాలవని గ్రహించిన్నట్లే ఉన్నారు. అందుకే ఈ ‘తాయిలాల గోదాం’ ‘సిద్ధం’ చేసుకొని ‘మేమందరం సిద్దం’ అంటున్నట్లున్నారు. అంటే లబ్ధిదారులు కూడా వైసీపికి ఓట్లు వేస్తారనే ‘నమ్మకం’ జగన్కు లేదని స్పష్టం అవుతోంది. కనుక మీ నమ్మకం, మా నమ్మకం తాయిలాలే జగన్ అని అనుకోవాలేమో?
అయిదేళ్ల అరాచకపాలనతో విసిగిపోయిన జనం… జగన్ ను శాశ్వతంగా తాడేపల్లి ప్యాలెస్ లో బంధించాలని నిర్ణయానికొచ్చిన నేపథ్యంలో చీప్ ట్రిక్స్ తో ప్రజాభీష్టాన్ని తారుమారు చేయాలని చూస్తున్నారు. ఎన్నికల్లో ఎలాగూ గెలవడం సాధ్యం కాదని తేలిపోవడంతో తాయిలాలతో ఓటర్లను ఏమార్చే ప్రయత్నం చేస్తున్నారు.… pic.twitter.com/TSse76ewNn
— Lokesh Nara (@naralokesh) March 27, 2024




