టిడిపి, జనసేన, బీజేపీలు పొత్తు పెట్టుకొని ఎన్నికలలో కలిసి పోటీ చేస్తుండటంతో చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, దగ్గుబాటి పురందేశ్వరి ముగ్గురూ బుధవారం రాత్రి 7 గంటలకు నిడదవోలు ప్రజాగళం సభలో ఒకే వేదికపై నుంచి ప్రసంగించనున్నారు.
ముందుగా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఇద్దరూ కలిసి సాయంత్రం 4 గంటలకు తణుకు పాలిటెక్నిక్ కళాశాల నుంచి నరేంద్ర సెంటర్ వరకు రోడ్ షో నిర్వహిస్తారు. ఆ తర్వాత అక్కడే బహిరంగ సభలో ఇద్దరూ ప్రసంగిస్తారు.
నిడదవోలు నుంచి జనసేన అభ్యర్ధి కందుల దుర్గేష్, తణుకు నుంచి టిడిపి అభ్యర్ధి అరిమిల్లి రాధాకృష్ణ శాసనసభకు పోటీ చేస్తున్నారు. వారి తరపున చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్లతో పాటు బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి కూడా ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు.
దగ్గుబాటి పురందేశ్వరి రాజమండ్రి నుంచి బీజేపీ అభ్యర్ధిగా లోక్సభకు పోటీ చేస్తున్నందున, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఇద్దరూ ఆమెకు మద్దతుగా త్వరలోనే రాజమండ్రిలో ఎన్నికల ప్రచారం చేయబోతున్నారు.
మూడు పార్టీల మద్య మొదట్లో విభేధాలు ఏర్పడి ఇంతకాలం ఎడమొహం పెడమొహం అన్నట్లు దూరంగా ఉండిపోయినా ఇప్పుడు మూడు పార్టీల మద్య సయోధ్య ఏర్పడిందని ఈ మూడు పార్టీల ఉమ్మడి సభలు, ఎన్నికల ప్రచారంతో స్పష్టమవుతోంది.
ఇంకా ప్రధాని నరేంద్రమోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా తదితరులు కూడా ఏపీలో ఎన్నికల ప్రచారానికి రావలసి ఉంది. వారు కూడా వచ్చి కూటమి సభలలో పాల్గొని ఎన్నికల ప్రచారం చేస్తే ఇక ఏపీలో ఎన్నికల వేడి పతాకస్థాయికి చేరుకుంటుంది. ఈ పొత్తులు, రాజకీయ పరిణామాలు అన్నీ వైసీపికి రాబోయే ప్రమాదాన్నే సూచిస్తున్నాయి.






