ఈసారి ఎన్నికలలో 175కి 175 సీట్లు మేమే గెలుచుకొంటామని సిఎం జగన్ పదేపదే చెపుతుంటారు. తెలంగాణను ఎంతగానో అభివృద్ధి చేసి చూపిన కేసీఆరే 119కి 119 సీట్లు గెలుచుకొంటామని గట్టిగా చెప్పుకోలేకపోతున్నారు. మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయని జగన్ అంత నమ్మకంగా ఏవిదంగా చెప్పగలుగుతున్నారు?అనే సందేహం కలగడం సహజమే.
సంక్షేమ పధకాలతో రాష్ట్రంలో ప్రతీ ఇంటికి మేలు చేశామనే జవాబు వినిపిస్తుంటుంది. కానీ వాటితో ఓట్లు రాలిపోతాయనే భ్రమలో వైసీపి నేతలు లేరనే విషయం వారి తిప్పలు చూస్తే అర్దమవుతుంది. మరి 175 సీట్లు ఎలా సాధ్యం? అంటే దానికీ ఓ వ్యూహం ఉంది.
ఎన్నికల నాటికి టిడిపి నేతలందరిపై కేసులు వేసి పోలీస్ స్టేషన్లు, కోర్టుల చుట్టూ తిప్పుతూ వీలైతే చంద్రబాబు నాయుడులా జైలుకి పంపించో ఎవరూ ప్రజల మద్య తిరగనీయకుండా చేసి వారి నుంచి పోటీ లేకుండా చేసుకోవడమే అని అర్దమవుతోంది.
ఇందుకు తాజా నిదర్శనమే పులివెందుల టిడిపి నియోజకవర్గం ఇన్చార్జి బీటెక్ రవిని మంగళవారం అరెస్టు చేయడం. పది నెలల క్రితం నారా లోకేష్ కడప విమానాశ్రయానికి వచ్చినప్పుడు స్వాగతం పలికేందుకు వచ్చిన బీటెక్ రవి అక్కడ విధులు నిర్వర్తిస్తున్న పోలీసులతో దురుసుగా ప్రవర్తించారని అప్పుడు ఎస్సై రమణ గాయపడ్డారని ఆరోపిస్తూ వల్లూరు పోలీసులు కేసు నమోదు చేశారు.
పది నెలల క్రితం నమోదు చేసిన ఆ కేసులోనే బీటెక్ రవిని నిన్న సాయంత్రం అరెస్ట్ చేశారు. ఆయనేమీ పోలీసులకు చిక్కకుండా తప్పించుకొని తిరుగుతున్న ఉగ్రవాదో వేర్పాటువాదో కాదు. రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్ష పార్టీలో ముఖ్యనేత. కనుక పోలీసులు ఆయన ఇంటికి వెళ్ళి నోటీస్ ఇచ్చి అరెస్ట్ చేసి ఉంటే పద్దతిగా ఉండేది.
కానీ ఆయన కడప నుంచి పులివెందుల తిరిగి వస్తుంటే దారిలో యోగి వేమన యూనివర్సిటీ వద్ద మఫ్టీలో కాపు కాసిన పోలీసులు ఆయనను అరెస్ట్ చేశారు. రాత్రి 10 గంటలకు కడప ప్రభుత్వాసుపత్రిలో వైద్య పరీక్షలు చేయించి జడ్జి ఎదుట హాజరు పరిచారు. తర్వాత కధ ఏవిదంగా సాగుతుందో అందరికీ తెలుసు.
టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు, నారా లోకేష్తో సహా టిడిపి ముఖ్య నేతలందరిపై ఇటువంటి అనేక కేసులు నమోదు అయ్యే ఉన్నాయి. అవన్నీ ఎక్కడికీ పోలేదు. ఇంకా లైన్లోనే ఉన్నాయి. వైసీపి ప్రభుత్వం తలుచుకొంటే వాటితో అందరినీ ఒకేసారి లోపల వేసేయగలదు. కానీ అలా చేస్తే వైసీపి కక్షసాధింపులకు పాల్పడుతోందనే టిడిపి వాదనలకు నిజమని ధృవీకరించిన్నట్లవుతుంది.
ఇప్పుడే తొందరపడి అందరినీ లోపల వేసేస్తే ఎన్నికల సమయానికి అందరూ బెయిల్ తీసుకొని బయటకు వచ్చేస్తారు. కనుక ఎన్నికల సమయంలో టిడిపి నేతలందరూ జైల్లో ఉండేలా చేయాలంటే, ఇప్పుడే తొందరపడకూడదనే ఉద్దేశ్యంతోనే కేసుల వేగం కాస్త నెమ్మదించిన్నట్లు కనబడుతోంది.
అలాగని వైసీపి ఏమీ చేతులు ముడుచుకొని కూర్చోదని బీటెక్ రవి అరెస్ట్ స్పష్టం చేస్తోంది. బహుశః ఈవిదంగానే ఎన్నికలలో వైసీపి 175కి 175 సీట్లు వస్తాయని అంత నమ్మకంగా చెపుతున్నట్లున్నారు.




