శుక్రవారం చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని యర్రగొండపాలెంలో పర్యటనకు వచ్చినప్పుడు మంత్రి ఆదిమూలపు సురేష్ నడిరోడ్డుపై చొక్కా విప్పేయడంపై టిడిపి, బిజెపి నేతల స్పందన చాలా ఆలోచింపజేస్తోంది.
బిజెపి సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు స్పందిస్తూ, “మంత్రి హోదాలో ఉన్న సురేష్ తన అనుచరుల చేత చంద్రబాబు నాయుడుపై రాళ్ళతో దాడి చేయించడం వైసీపీ అరాచకాలకి పరాకాష్టగా చెప్పుకోవచ్చు. ఆయన నడిరోడ్డుపై చొక్కా విప్పడం వైసీపీ భవిష్యత్ అలాగే ఉండబోతోందని సూచిస్తోంది. మీరు చొక్కాలు విప్పుకోవడం కాదు… వచ్చే ఎన్నికలలో ప్రజలే మీ అందరి చొక్కాలు విప్పించబోతున్నారు. తన మంత్రులు ఇలా రోడ్లపై చొక్కాలు, ఫ్యాంట్లు విప్పుకొంటుంటే సిఎం జగన్ ఏం చేస్తున్నారో తెలీదు. వారిని కట్టడి చేయకబోతే రేపు మరో మంత్రి బట్టలు విప్పుకొని ప్రజల మద్యకు వచ్చేస్తాడు,” అని ఎద్దేవా చేశారు.
టిడిపి సీనియర్ నేత, మాజీ మంత్రి కెఎస్ జవహార్ స్పందిస్తూ, “సురేష్ తండ్రి దళితుల ఆత్మ గౌరవం కోసం గుర్రం మీద తిరిగితే, ఈయన రోడ్లపై చొక్కాలు విప్పుకొని తిరుగుతూ దళితులని కించపరుస్తున్నాడు. సురేష్ దళితుల ఆత్మగౌరవాన్ని సిఎం జగన్మోహన్ రెడ్డి పాదాల వద్ద తాకట్టు పెట్టాడు. అక్రమస్తుల కేసులో తన అధినేతతో పోటీ పడుతున్న సురేష్, ఆ కేసులకు భయపడే జగన్ ఆడమన్నాట్లల్లా ఆడుతున్నాడు.
చంద్రబాబు నాయుడు యర్రగొండపాలెంలో పర్యటనకు వస్తే దళితులకు అన్యాయం జరిగిపోయిందని చొక్కాలు చింపేసుకొంటున్న మంత్రి సురేష్, ఇసుక మాఫియా గురించి ధైర్యంగా ప్రభుత్వాన్ని నిలదీసిన దళితుడు వరప్రసాద్కు శిరోముండనం చేసినప్పుడు ఎక్కడున్నాడు?డాక్టర్ సుధాకర్, డాక్టర్ అచ్చెన్న వరకు అనేక మంది దళితులపై జగన్ ప్రభుత్వం దాడులు చేసి బహిరంగంగా అవమానిస్తుంటే అప్పుడు ఈ సురేష్ ఎక్కడున్నాడు?వారికి అండగా ఎందుకు నిలబడలేదు? ఎందుకు మాట్లాడలేదు?నీకు మీ జగనన్న మంత్రి పదవి ఇచ్చినా, నిన్ను కూడా చొక్కా విప్పించి రోడ్డు మీద నిలబెట్టించాడని గ్రహించలేకపోతున్నావా సురేష్?” అంటూ ఘాటుగా స్పందించారు.
వైసీపీకి అసలే గడ్డుకాలం నడుస్తుంటే, మంత్రి హోదాలో ఉన్న ఆదిమూలపు సురేష్, సీదిరి అప్పలరాజు, అంబటి రాంబాబు, ధర్మాన ప్రసాదరావు, గుడివాడ అమర్నాథ్ వంటివారు నోటికి వచ్చిన్నట్లు మాట్లాడుతూ, ప్రవర్తిస్తూ వైసీపీని నవ్వులపాలుజేస్తున్నారని చెప్పక తప్పదు. అయితే నానాటికీ పుంజుకొంటున్న టిడిపిని ఈవిదంగానే ఎదుర్కోవాలని వారి అధినేత భావిస్తున్నారేమో తెలీదు కానీ ఇప్పటికే తీవ్ర అప్రదిష్టమూటగట్టుకొన్న వైసీపీకి ఇటువంటివన్నీ తీరని నష్టం చేస్తాయని చెప్పక తప్పదు.



