2004 సంవత్సరంలో కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టక మునుపు కేవలం 9 లక్షల
వార్షిక ఆదాయం కలిగిన జగన్ మోహన్ రెడ్డి, ఆ తర్వాత అనతి కాలంలోనే దాదాపు 90 కోట్లు అడ్వాన్స్ టాక్స్ కట్టి సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. అడ్వాన్స్ టాక్స్ అంత చెల్లించారంటే ఆ తర్వాత మరెంత పన్ను చెల్లించి ఉంటారో అంచనా వేయవచ్చు. అలాంటి జగన్ ప్రస్తుతం దేశంలోనే ఎక్కువ పన్ను చెల్లించే వ్యక్తులలో ఒకరని, ఇదంతా ఎలా సాధ్యమైందో అందరికీ తెలిసిన విషయమేనని టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి విమర్శలు చేసారు.
అక్రమాస్తుల కేసుల్లో ఉన్న జగన్ నివాసాన్ని ఈడీ అటాచ్ చేసిన తర్వాత
ప్రతిపక్ష నేతగా కొనసాగే అవకాశాన్ని జగన్ కోల్పోయారని, అలాగే పార్టీ
అధ్యక్షుడిగా ఉండే అర్హత జగన్ కు లేదని, ముందు ఆ హోదా నుండి తప్పుకుని,వేరొకరిని వైసీపీకి అధ్యక్షుడిని చేయాలని, లేని పక్షంలో అసలు పార్టీనే మూసివేసేయాలని సోమిరెడ్డి డిమాండ్ చేసారు. తనను నమ్ముకున్న వ్యక్తులనే జైలుకు పంపిన వ్యక్తి జగన్ అని, ఆ పార్టీ నేతలకు ఎక్కడకు వెళ్ళినా
అవమానాలు తప్పవని అన్నారు.
ఓ రాజకీయ పార్టీ కార్యాలయాన్ని జప్తు చేయడం దేశ చరిత్రలోనే ఇదే
తొలిసారని, జగన్ కు ఏ మాత్రం నైతిక విలువలు ఉన్నా తన పార్టీని
మూసేసి రాజకీయాలను వదిలేయాలని అన్నారు. తాజాగా వెలువడిన ఈడీ ఆస్తుల అటాచ్మెంట్ తో జగన్ పై ఒత్తిడి బాగా పెరిగినట్లయ్యింది. ముఖ్యంగా ఇప్పటివరకు అవినీతి అంశాన్ని దాటవేస్తూ వచ్చిన జగన్… ఇక సమాధానం చెప్పుకోలేని పరిస్థితుల్లోకి వెళ్లిపోయారని రాజకీయ వర్గాలు పేర్కొంటున్నాయి.



