తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత యరపతినేని శ్రీనివాసరావు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పై విమర్శలు గుప్పించారు. తమ అధినేత చంద్రబాబు వయస్సు గురించి విమర్శలు చేసేవారు ఆయనతో కలిసి తిరుమల కొండ ఎక్కేందుకు పోటీపడాలని ఆయన సవాలు విసిరారు.
నేర చరిత్ర ఉన్న వ్యక్తి పాలిస్తే రాష్ట్రం ఎలా ఉంటుందో జగన్ ఏడాది పాలనే ఉదాహరణ అని ఎద్దేవా చెప్పారు. ప్రభుత్వ తప్పిదాలను న్యాయస్థానాలు తప్పుబడుతుంటే.. వాటిని పక్కదోవ పట్టించేందుకు అధికార పార్టీ నేతలు తెలుగుదేశం పార్టీని నిందిస్తున్నారని మండిపడ్డారు. ప్రజలు తిరగబడితే పరిస్థితులు వేరుగా ఉంటాయని హెచ్చరించారు.
“ఇటీవలే నల్లజాతీయుల తిరుగుబాటుకు భయపడి అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ శ్వేతసౌధంలోని బంకర్ లో దాక్కున్నారట.. ప్రజలు తిరగబడితే జగన్ కు కూడా అటువంటి పరిస్థితి తప్పదు,” అని ఆయన హెచ్చరించారు. ఆంధ్రప్రదేశ్ లో కూడా బంకర్లు ఏర్పాటు చేసుకునే పరిస్థితి జగన్ కు త్వరలోనే వస్తుందని ఆయన జోస్యం చెప్పారు.
జగన్ మొదటి ఏడాది పూర్తి కాగానే కోర్టులలో వరుస వ్యతిరేక తీర్పులు, సొంత పార్టీలోనే అసమ్మతి వంటి పరిణామాలతో టీడీపీ నేతలలో జోష్ పెరిగినట్టుగా కనిపిస్తుంది. అలాగే తమ పార్టీ ఎమ్మెల్యేల కోసం పన్నిన ఫిర్యాయింపు వల కూడా ఫెయిల్ కావడంతో వారు ధీమాగా ఉన్నారు.





