కడపలో స్టీల్ప్లాంట్ స్థాపన కుదరదని కేంద్రం తేల్చి చెప్పడంతో. దానిని సాధించడం కోసం తమ పోరాటం ఉధృతం చేస్తామని టీడీపీ ఎంపీ సీఎం రమేష్ స్పష్టం చేశారు. ఇప్పటికే గురువారం కడపలో ఆందోళన చేపట్టిన తెలుగు దేశం ఈ నెల 17న ప్రధానమంత్రి నరేంద్రమోదీని కలిసి వినతిపత్రం ఇవ్వడానికి ఎంపీలను సిద్ధం చేసింది.
ప్రధాని స్పందించకపోతే 24న కడపలో ఆమరణ దీక్ష చేపడతానని రాజ్యసభ ఎంపీ సీఎం రమేష్ స్పష్టం చేశారు. కడపలో స్టీల్ప్లాంట్ ఏర్పాటుపై కేంద్రం పాత నివేదికతో అఫిడవిట్ వేయడం దారుణమని రమేష్ అన్నారు. కాగా కడప స్టీల్ ప్లాంట్ కోసం సీఎం రమేష్ చేపట్టనున్న దీక్ష విజయవంతం చేయాలని సీఎం చంద్రబాబు పార్టీ నేతలకు సూచించారు.
ఎంపీలంతా కడప వెళ్లి సంఘీభావం ప్రకటించాలని చెప్పారు. విభజన చట్టంలో పేర్కొన్న విధంగా కడప బయ్యారంలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు సాధ్యపడదని కేంద్రం సుప్రీం కోర్టులో అఫిడవిట్ వేసింది. చట్టంలో కేవలం సాధ్యాసాధ్యాలు పరిశీలించాలని మాత్రమే ఉందని కేంద్రం ఉన్నత న్యాయస్థానానికి తెలిపింది.



