ఈ ఓటమి వైనాట్‌ కుప్పంకి రిటర్న్ గిఫ్టే నో డౌట్!

TDP Wins Pulivendula ZPTC, Stuns YSRCP

జగన్‌ కంచు కోట పులివెందులలో జెండా ఎగరేసిన టీడీపీ, మరో కంచుకోట ఒంటిమిట్టలో కూడా జెండా ఎగరేసింది.

పులివెందుల జెడ్పీటీసీని టీడీపీ అభ్యర్ధి మార్రెడ్డి లతా రెడ్డి 6,035 ఓట్ల మెజార్టీతో విజయం సాధించగా ఒంటిమిట్టలో టీడీపీ అభ్యర్ధి ముద్దు కృష్ణారెడ్డి తన సమీప వైసీపీ ప్రత్యర్ధి సుబ్బారెడ్డిపై 6154 ఓట్ల మెజారిటీ సాధించారు. సుబ్బారెడ్డికి 6,351 రాగా, టీడీపీ అభ్యర్థి ముద్దుకృష్ణారెడ్డికి దాదాపు రెట్టింపు ఓట్లు 12,505 వచ్చాయి.

ADVERTISEMENT

ఒకప్పుడు జగన్‌ కనుసైగ చేస్తే తప్ప అడుగు ముందుకు వేయలేని పులివెందుల, ఒంటిమిట్టలో ఇప్పుడు టీడీపీ శ్రేణులు టపాకాయలు కాల్చి సంబరాలు చేసుకుంటున్నారు.

‘మొన్న టీడీపీ కార్యాలయంలో నేతలు సాక్షి ఛానల్ పెట్టుకొని జగన్‌ ప్రెస్‌మీట్‌లో ఏం చెపుతారా?’ అని ఆత్రంగా ఎదురు చూశారని వైసీపీ సోషల్ మీడియాలో గొప్పగా చెప్పుకున్నారు.

ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి, అవినాష్ రెడ్డి ఇద్దరూ తమ ఇళ్ళలో కూర్చొని పులివెందుల, ఒంటిమిట్టలో టపాకాయలు కాల్చి సంబరాలు చేసుకుంటున్న టీడీపీ శ్రేణులను న్యూస్ ఛానల్స్‌లో చూస్తూ భరించక తప్పదు.

అసలు కంచుకోటలో ఈ ఓటమి ఏమిటి?అసలు ఈవిదంగా ఎందుకు జరిగింది?అని ఆలోచిస్తే ఓ బలమైన కారణం కనిపిస్తోంది.

నాడు జగన్‌ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడుని కుప్పంలో దెబ్బకొట్టి రాజకీయాల నుంచి తప్పుకునేలా చేయాలనుకున్నారు. ‘వైనాట్ కుప్పం?’ అంటూ టీడీపీ శ్రేణులను పదేపదే రెచ్చగొట్టేవారు. దానికి టీడీపీ ఇచ్చిన ‘రిటర్న్ గిఫ్టే’ ఇది!

ఒకవేళ ఆనాడు జగన్‌ అలా ప్రవర్తించకపోతే, ఈ చిన్న ఎన్నికలని టీడీపీ కూడా పెద్దగా పట్టించుకునేది కాదు. జగన్‌కి నేడు ఇంత ఘోర అవమానం ఎదురయ్యేదే కాదు. కనుక ఈ ఓటమి, అవమానం రెండూ కూడా జగన్‌ స్వయంకృతాపరాధమే.

జగన్‌కి ఆయన పద్దతిలోనే బుద్ధి చెప్పాలనే టీడీపీ పంతం పట్టి పులివెందులలోనే ఓడించి ప్రతీకారం తీర్చుకుంది. కనీసం ఇప్పటికైనా జగన్‌ ఈ విషయం తెలుసుకొని ఉంటే నిన్న ప్రెస్‌మీట్‌లో ఆవిదంగా మాట్లాడేవారే కారు. కానీ ఆయన ధోరణి ఏ మాత్రం మారలేదని స్పష్టమవుతోంది. కనుక జగన్‌ ఆహానికి వైసీపీ బలికాక తప్పదు.

ADVERTISEMENT
Latest Stories