తెలంగాణ ఎన్నికల ఫలితాలు వచ్చిన రెండు నెలల తరువాత మంత్రివర్గ విస్తరణకు ముహుర్తం ఖరారు అయింది. ఈ నెల 19వ తేదీ ఉదయం 11.30 గంటలకు మంత్రివర్గ విస్తరణ జరగనుంది. ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావు కాసేపటి క్రితం గవర్నర్ నరసింహన్ తో భేటీ అయిన తరువాత ముఖ్యమంత్రి కార్యాలయం దీనిని అధికారికంగా ప్రకటించింది. ఈ నెల 19న మాఘ శుద్ధ పౌర్ణమి నేపథ్యంలో కేసీఆర్…మంత్రివర్గ విస్తరణకు ఆ రోజున ముహుర్తం నిర్ణయించారు. ఇక తెరాస వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, సిద్ధిపేట ఎమ్మెల్యే హరీశ్ రావుకు మంత్రివర్గంలో చోటు దక్కుతుందా లేదా అనే సస్పెన్స్ కొనసాగుతోంది.
గత ప్రభుత్వంలోని మంత్రులతోపాటు కొత్త వారిని కలిపి మంత్రివర్గ కూర్పు ఉండనున్నట్లు తెలుస్తోంది. పరిమిత సంఖ్యలో మంత్రులను తీసుకుని సార్వత్రిక ఎన్నికల తరువాత పూర్తి స్థాయిలో విస్తరణ ఉంటుందని సమాచారం. అయితే మంత్రివర్గంలో ఎవరెవరికి చోటు దక్కుతుందనే ఇంకా తెలియరాలేదు. మరోవైపు ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఏర్పాట్లు చేయాల్సిందిగా ముఖ్యమంత్రి అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. రాజ్ భవన్ లోనే ఈ కార్యక్రమం జరుగుతుంది.
తెలంగాణ శాసనసభ లో ఈ నెల 22న బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నారు. ఆర్ధిక మంత్రి లేకపోవడంతో ముఖ్యమంత్రి అధికారులతో కలిసి బడ్జెట్ ను రూపొందించారు. అయితే కొత్తగా ఆర్ధిక మంత్రి గా నియమించినవారే బడ్జెట్ ను ప్రవేశ పెట్టబోతున్నారు. తెలంగాణ మొట్టమొదటి ఆర్ధిక మంత్రి గా ఈటెల రాజేంద్ర నాలుగు బడ్జెట్లు ప్రవేశపెట్టారు. ఆయనకు మరో అవకాశం వస్తుందా అనేది చూడాలి. పార్లమెంట్ కు ఎన్నికలు జరగనుండడంతో పూర్తి స్థాయి బడ్జెట్ కాకుండా వోట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ను పెడుతున్నారు కెసిఆర్. బహుశా చరిత్ర లో గెలిచిన మొదటి బడ్జెట్ ను పూర్తి స్థాయి బడ్జెట్ గా కాకుండా పెట్టడం ఇదే తొలి సారి కావొచ్చు.



