రైతుల పంటలు ఎండిపోతున్నాయి అంటూ నిన్న బిఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ కాంగ్రెస్ పార్టీ పైన, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పైన విమర్శలతో విరుచుకుపడ్డారు. దీనికి కౌంటర్ గా ఈ రోజు కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన తిక్కుగూడ బహిరంగ సభలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేసీఆర్ పై మాటల దాడే చేసారు.
10 ఏళ్ల కేసీఆర్ పాలనలో తెలంగాణ రాష్ట్రాన్ని కేసీఆర్ కుటుంబం దోచేసింది, వారి పాలనలో తెలంగాణ సర్వ నాశనమయ్యిందన్నారు. నిన్న మొన్న ఒక నక్క బయలు దేరినదని, మొన్న సూర్య పేట, నిన్న కరీంనగర్ పోయి మీడియా ముందుకు వచ్చి నోటికి వచ్చింది వాగుతుంది అంటూ కేసీఆర్ ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు.
నేను జానారెడ్డి లెక్క కాదు బిడ్డా, రేవంత్ రెడ్డి ని…అధికారం పోయి, కాలు విరిగి, కూతురు జైలుకు వెళ్ళినదనే బాధలో ఉన్నావులే అని కాస్త గ్యాప్ ఇచ్చాం. దానిని అవకాశంగా తీసుకుని ప్రభుత్వం పై, కాంగ్రెస్ పార్టీ పై తప్పుడు మాటలు మాట్లాడితే ఊరుకునేది లేదంటూ కేసీఆర్ ను హెచ్చరించారు రేవంత్.
కేసీఆర్ ప్రభుత్వంలో పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇల్లు నిర్మిస్తానంటూ హామీ ఇచ్చి పేదలను మోసం చేసాడు కేసీఆర్. కానీ నేను కేసీఆర్ కు హామీ ఇస్తున్నా కేసీఆర్ కోసం చర్లపల్లి జైల్లో కచ్చితంగా డబుల్ బెడ్ రూమ్ ఇల్లు నిర్మిస్తా. కొడుకు, కూతురు, అల్లుడు వచ్చినా విశాలంగా ఉండాలి కదా అంటూ కేసీఆర్ కు ఫామిలీ ప్యాకేజ్ ఆఫర్ ఇచ్చారు రేవంత్.
బూతులకు బూతులే సమాధానం అన్నట్టు నిన్న కేసీఆర్ విమర్శలకు నేడు రేవంత్ కౌంటర్లు కూడా అదే మాదిరి సాగాయి. అయితే ఒక మాజీ ముఖ్యమంత్రి అయిఉండి ఒక రాష్ట్ర అధినేతను ఉద్దేశించి మాట్లాడవలసిన మాటలు, కానీ చేయవలసిన విమర్శలు కానీ కేసీఆర్ చేయలేదు…, అలాగే ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉంటూ ఒక ప్రతిపక్ష నేత, మాజీ ముఖ్యమంత్రి ని ఉద్దేశించి చేసే ప్రతి విమర్శలను రేవంత్ చేయడంలేదు.
ఎవరికీ వారు వారి స్థాయిని మరచి, రాజకీయాలలో దిగజారి మరి విమర్శలు చేయడం ఏమాత్రం సబబు కాదనేది ఇద్దరు నేతలు గ్రహించాలి. ఇది సమాజానికి అత్యంత హానికరం అనేది ఏపీ రాజకీయాలను చూస్తే ఇట్టే అర్ధమవుతుంది. కనీసం తెలంగాణలో అయినా ఈ సంస్కృతిని ప్రోత్సహించకుండా జాగ్రత్త పడాలి రాజకీయ పార్టీలు.




