నేటితో తెలంగాణలో రాజకీయ పార్టీల ఎన్నికల ప్రచార ఘట్టం ముగిసింది.ఏ పార్టీకి ఆ పార్టీ నువ్వా నేనా అన్నట్లు తమ ప్రచారాలతో తెలంగాణ ప్రజలకు దగ్గరయ్యారు. మా పార్టీకి ఓటేయండి మీఇంటికి ఉచిత పథకాలు తీసుకెళ్లండి అనే ధోరణితోనే ఆద్యంతం రాజకీయ పార్టీలు తమ ప్రచారాన్ని ముందుకు తీసుకెళ్లాయి.
అయితే ఇంతకాలం తమ ప్రసంగాలతో ప్రజలను ఆకర్షించిన పార్టీలు ఇక తమ పార్టీ గెలుపోటముల మీద ప్రణాళికలు రచించడం మొదలుపెడతాయి. తెలంగాణ ప్రజలు ఏకపక్ష తీర్పు ఇస్తే సమస్య ఉండదు అలా కాకుండా రాష్ట్రంలో హాంగ్ ఏర్పడేలా ఉంటే ఇక రాజకీయ పార్టీలు తమ అభ్యర్థులను కాపాడుకోవడానికి పార్టీ గెలుపుకంటే ఎక్కువ శ్రమించాల్సి వస్తుంది.
క్యాంపు రాజకీయాలు మొదలవుతాయి. ఏ పార్టీ అభ్యర్థి ఏ పార్టీ కండువా కప్పుకుంటాడో ఏ పార్టీ జెండా మోస్తాడో అర్ధం కానీ పరిస్థితి నెలకొంటుంది.ఇంతకాలం ఎన్నికల ప్రచారంలో ఒకరి మీద ఒకరు కత్తులు దూసుకున్న రాజకీయ పార్టీలు ఒకరి చెంతకు ఒకరు చేరుకోవాల్సి వస్తుంది. ఒకవేళ అదే పరిస్థితి ఎదురైతే అనుసరించాల్సిన వ్యూహాలు ఎలా ఉండాలో, తీసుకోవాల్సిన చర్యలు ఏమిటో ఇప్పుడే రాజకీయ పార్టీలు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటాయి.ఆ ప్రకారంగానే రాజకీయ పార్టీలు, పార్టీల అధినేతలు తమ అడుగులు వేసి ఎన్నికల పద్మవ్యూహం నుండి బయటపడి లక్ష్యాన్ని చేరుకోవాలి.




