తెలంగాణలో ఎన్నికల పోలింగ్ ముగిసింది. నిన్న మొన్నటి వరకు నువ్వా నేనా అంటూ మైకులు విరిగిపోయేలా…గొంతులు అరిగిపోయేలా చేసిన ప్రచారాలకు తమ పోలింగ్ తో సమాధానం ఇచ్చారు ప్రజలు. అయితే కొన్ని కొన్ని ప్రాంతాలు మినహా రాష్ట్రంలో పోలింగ్ ప్రశాంతంగా సాగిందనే చెప్పాలి.
పోలింగ్ ముగియడంతో ఇక మీడియాలో ఎగ్జిట్ పోల్స్ సందడి మొదలయ్యింది. CNN, ఆరా, ఇండియా టుడే వంటి సంస్థలు తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీ వైపే నిలిచారని కాంగ్రెస్ పార్టీ అతిపెద్ద పార్టీగా అవతరించి తెలంగాణలో ప్రభుత్వాన్ని స్థాపించేంత బలం చేకూర్చుకుంటుందంటూ తమ సర్వే నివేదికలో పొందుపరిచారు.జాతీయ మీడియా కూడా ఇంచుమించు ఇదే విధంగా తన సర్వే ఫలితాలను వెలువరించింది.
ముందు నుంచి కూడా సర్వేలన్నీ కాంగ్రెస్ పార్టీ వైపే సానుకూల ఫలితాలు ఉంటాయని వెల్లడిస్తున్నాయి.ప్రముఖ సర్వే సంస్థ అయిన చాణక్య స్టాటజీస్ బిఆర్ఎస్ పార్టీకి కేవలం 20 నుండి 30 స్థానాలకే పరిమితమవుతుంది అంటూ ప్రకటించి బిఆర్ఎస్ పార్టీకి గట్టి షాకే ఇచ్చింది. జన్ కి బాత్ సర్వ్ ఏజెన్సీ మాత్రం రెండు పార్టీల మధ్య టగ్ అఫ్ వార్ నడుస్తుందని రాష్ట్రంలో హంగ్ ఏర్పడే పరిస్థితులు రావచ్చు అంటూ తన నివేదికను వెల్లడించింది.
ప్రస్తుతానికి వెలువడిన సర్వే నివేదికలన్నీ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా రావడంతో తదుపరి కార్యచరణకు అవసరమైన చర్యలకు వ్యూహాలు రచిస్తున్నారు ఆ పార్టీ ముఖ్య నేతలు. ”పండేండ్ల అహకారం పోవాలి”, ”మార్పు కావాలి కాంగ్రెస్ రావాలి”…అంటూ కాంగ్రెస్ పార్టీ అందుకున్న నినాదం ప్రజలలోకి బాగానే వెళ్లినట్టుంది. డిసెంబర్ 3 న వెలువడే ఫలితాల కోసం అటు తెలంగాణ రాజకీయ పార్టీలు, తెలంగాణ ప్రజలతో పాటు ఇటు ఏపీలో కూడా అంతే ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి ఇక్కడి రాజకీయ పార్టీలు, ఇక్కడి ప్రజలు. ఎదురుచూపులే కాదు సుమీ బెట్టింగ్ లతో ఎదురు డబ్బులు కూడా పెద్ద ఎత్తున చేతులు మారనున్నాయని వార్తలు ప్రచారంలో ఉన్నాయి.




