తెలంగాణ శాసనసభ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ గెలువబోతోందని, బిఆర్ఎస్ ఓడిపోబోతోందని దాదాపు 10 సర్వే సంస్థలు ముందే చెప్పాయి. వాటిపై హుందాగా స్పందించాల్సిన మాజీ మంత్రి కేటీఆర్, “బిఆర్ఎస్ పార్టీ గెలిస్తే అవన్నీ క్షమాపణలు చెపుతాయా?” అంటూ సవాలు విసిరారు.
వాటి లెక్కలు కాస్తా అటూ ఇటూగా ఉన్నప్పటికీ చివరికి వాటి జోస్యమే ఫలించింది. బిఆర్ఎస్ దారుణంగా ఓడిపోయింది. సర్వే నివేదికలలో వాస్తవాలు ఎంత? అనేది పక్కన పెడితే కీలకమైన ఎన్నికల వేళ ఆ సర్వేలు ప్రజలపై తీవ్ర ప్రభావం చూపుతాయనేది వాస్తవం. సర్వేలు ఫలానా పార్టీ గెలుస్తుందని నొక్కి చెపుతున్నప్పుడు, ప్రజలు తమ ఓట్లు వృధా కాకూడదనే ఆలోచనతో వారు కూడా గెలిచే పార్టీకే ఓట్లు వేసే అవకాశాలు ఉంటాయి.
సరిగ్గా ఈ పాయింట్తోనే పెయిడ్ సర్వేలు కూడా పుట్టుకొస్తుంటాయి. వాటి సాయంతో రాజకీయ పార్టీలు మీడియా, సోషల్ మీడియాలో తమకు అనుకూలంగా సర్వే నివేదికలు వచ్చేలా చేసుకొంటాయి. కాంగ్రెస్, బిఆర్ఎస్ రెండూ కూడా అటువంటి ప్రయత్నాలు చేశాయని సర్వే నివేదికలను చూస్తే అర్దమవుతుంది.
రాజనీతి వంటి కొన్ని సర్వేలు బిఆర్ఎస్ పార్టీ 119కి 75కి పైగా సెట్లు గెలుచుకొని మళ్ళీ అధికారంలోకి రాబోతోందని పదేపదే నొక్కి చెప్పాయి. ఇది కేసీఆర్, కేటీఆర్ చెప్పుకొంటున్న నంబర్లే అని అందరికీ తెలుసు. కాంగ్రెస్ పార్టీకి కేవలం 27-35 సీట్లు రావచ్చని రాజనీతి జోస్యం చెప్పింది. కానీ కాంగ్రెస్కు 64, బిఆర్ఎస్కు కేవలం 39 సీట్లు మాత్రమే వచ్చాయి. బిఆర్ఎస్ ఓడిపోయింది. అది వేరే సంగతి.
బిఆర్ఎస్ పార్టీ ఏవిదంగా తమ పార్టీ గెలుపు కోసం వ్యూహాలు అమలుచేస్తుందో, అదేవిదంగా కాంగ్రెస్తో సహా ఇతర పార్టీలు కూడా వాటివాటి వ్యూహాలు అమలుచేస్తాయి. కనుక వేటినీ తప్పుపట్టడానికి లేదు. కానీ సర్వేలన్నీ తమకు వ్యతిరేకంగా సూచిస్తున్నప్పుడు వాటితో అప్రమత్తం కావలసిన కేటీఆర్, ఆ సంస్థలన్నీ తమకు క్షమాపణ చెప్పాలని కోరడమే తప్పు. ఇప్పుడు ఆయన వాటికి క్షమాపణలు చెపుతారా?
అయినా బిఆర్ఎస్ ఓడిపోబోతోందని కేసీఆర్ చాలా ముందే పసిగట్టారు కనుకనే ప్రశాంత్ కిషోర్తో భేటీ అయ్యారు కదా? కానీ ఓడిపోబోతున్నామని చెప్పుకొంటే ఈ మాత్రం సీట్లు కూడా రావు కనుక మేకపోతు గాంభీర్యం ప్రదర్శించక తప్పలేదనుకోవాలి.




