ఏపీ, తెలంగాణలు రెండు రాష్ట్రాలుగా విడిపోయినప్పటికీ వాటి మద్య రాజకీయాలు మాత్రం యదాతధంగానే సాగుతున్నాయి. ఉదాహరణకు తెలంగాణలో జనసేన 8 సీట్లకు పోటీ చేసింది. అది గెలిచినా, ఓడినా ఆ ప్రభావం ఏపీలో జనసేనపై తప్పక ఉంటుంది.
కనుక తెలంగాణలో ఏ పార్టీ గెలిచి అధికారంలోకి వస్తుందనేది ఏపీ రాజకీయాలను, తర్వాత జరుగబోయే ఏపీ శాసనసభ, లోక్సభ ఎన్నికలపై తప్పక ప్రభావం చూపుతుంది. కానీ అటువంటిదేమీ ఉండదని వైసీపి ఆత్మసాక్షి తేల్చి చెప్పేసింది.
ఎందుకంటే, ఏపీలోని వైసీపి, జగన్ ప్రభుత్వం రెండూ తెలంగాణ రాజకీయాలలో జోక్యం చేసుకోలేదు. ఎవరితో పొత్తులు పెట్టుకోలేదు. ఏ పార్టీకి రహస్యంగా సహకరించలేదు. వ్యతిరేకించకుండా న్యూట్రల్గా ఉండిపోయారు. కనుక కేసీఆర్, రేవంత్ రెడ్డి ఇద్దరిలో ఎవరు సిఎం అయినా వారు కూడా ఏపీ ఎన్నికలలో వేలుపెట్టడానికి ఇష్టాపడకపోవచ్చని ఆత్మసాక్షి కనిపెట్టి చెప్పింది.
అయితే కేసీఆర్ గెలిచినా, ఓడినా చేతులు ముడుచుకొని కూర్చోనే రకం కాదని అందరికీ తెలుసు. గెలిస్తే ఇక ఆయన ‘అహం బ్రహ్మాస్మి’ అన్నట్లు రెచ్చిపోవడం ఖాయం. ఇక ఆయనను ఎవరూ ఆపలేరు. ఆయన లక్ష్యం ప్రధాని కావడం కుదరకపోతే జాతీయ రాజకీయాలలో చక్రం తిప్పడమే.
కనుక ఏపీలో కూడా బిఆర్ఎస్ పార్టీని యాక్టివేట్ చేయవచ్చు లేదా తెలంగాణ అభివృద్ధికి ఏపీ సిఎంగా జగన్ ఉండటం చాలా అవసరం. కనుక వైసీపిని గెలిపించేందుకు జగన్మోహన్ రెడ్డికి మళ్ళీ పూర్తి సహాయ సహకారాలు అందించవచ్చు. అందుకు బదులుగా లోక్సభ ఎన్నికల తర్వాత వైసీపి ఎంపీలను తన కనుసన్నలలో ఉంచాలని కోరవచ్చు.
ఒకవేళ ఎగ్జిట్ పోల్స్ చెప్పిన్నట్లు ఓడిపోతే, కేసీఆర్ అహం దెబ్బతింటుంది. కనుక వెంటనే జరిగే లోక్సభ, ఏపీ శాసనసభ ఎన్నికలలో తన సత్తా చాటిచూపేందుకు తప్పక ప్రయత్నిస్తారు.
ఒకవేళ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయితే ఆయన తప్పకుండా ఏపీ శాసనసభ ఎన్నికలలో టిడిపికి ప్రత్యక్షంగానో లేదా పరోక్షంగానో తోడ్పడవచ్చు. వేరెవరైనా ముఖ్యమంత్రి అయితే టిడిపికి అంత తోడ్పాటు లభించకపోవచ్చు.
మరో ముఖ్య విషయం ఏమిటంటే కర్ణాటక, తెలంగాణలలో వరుస విజయాలు సాధించిన కాంగ్రెస్ తదుపరి లక్ష్యం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే అవుతుంది. కానీ ఇప్పటికిప్పుడు ఏపీలో కాంగ్రెస్ పుంజుకోలేదు. కనుక టిడిపి, జనసేనలకు ప్రత్యక్షంగానో లేదా పరోక్షంగానో సహకరించడం ఖాయమనే భావించవచ్చు.
ఇక తెలంగాణలో ఓడిపోబోతున్న బీజేపీ ఏపీలో ఒంటరిగా పోటీ చేయలేదు. అలాగని తాము విమర్శిస్తున్న వైసీపితో నేరుగా పొత్తు పెట్టుకోలేదు. కనుక జనసేనతో కలిసి ముందుకు సాగక తప్పదు.
టిడిపి, జనసేనల బంధం ఎంత బలంగా ఉండాలో పవన్ కళ్యాణ్ నిన్ననే మరోసారి చెప్పారు. అంటే టిడిపితోనే కలిసి ముందుకు సాగుతానని మరోసారి స్పష్టంగా చెప్పిన్నట్లే. కనుక బీజేపీకి ఇష్టం ఉన్నా లేకపోయినా టిడిపితో పొత్తుకి అంగీకరించక తప్పదు.
కనుక తెలంగాణ ఎన్నికల ఫలితాల ప్రభావం ఏపీ రాజకీయ సమీకరణాలు, వాటి బలాబలాలు, ఎన్నికలపై తప్పకుండా ఉంటుందని అర్దమవుతోంది. కానీ ఉండదనే భ్రమలో వైసీపి ఉండాలనుకొంటే ఎవరు వద్దంటారు? ఇప్పటికే 175 సీట్ల భ్రమలో ఉంది కనుక మరో భ్రమ వలన వైసీపికి కొత్తగా జరిగే నష్టం ఏమీ ఉండబోదు కదా?




