కేసీఆర్‌ ఇబ్బంది అలా తప్పిపోయింది కానీ….

KCR-Yashodha-Hospital

దాదాపు రెండు దశాబ్ధాలుగా తెలంగాణ రాష్ట్రాన్ని, రాజకీయాలను కంటిచూపుతో శాశించిన కేసీఆర్‌, ఇప్పుడు శాసనసభలో ప్రతిపక్ష బెంచీలలో కూర్చోవలసివస్తోంది. అదీ… గతంలో ఆయన జైలుకి పంపించిన, శాసనసభ నుంచి పదేపదే బహిష్కరించి బయటకు పంపించిన రేవంత్‌ రెడ్డి ముఖ్యమంత్రి స్థానంలో కూర్చొని ఉండగా, తాను ప్రతిపక్ష బెంచీలో కూర్చోవడం కష్టమే.

ADVERTISEMENT

కనుక తన కుమారుడు కేటీఆర్‌ లేదా మేనల్లుడు హరీష్ రావులలో ఎవరో ఒకరిని బిఆర్ఎస్ శాసనసభాపక్ష నేతగా ఎంపిక చేయబోతున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే ముందుగా రేపటి నుంచి నాలుగు రోజులపాటు సాగే శాసనసభ సమావేశాలకు హాజరయ్యి కేసీఆర్‌ ఎమ్మెల్యేగా ప్రమాణస్వీకారం చేయాల్సి ఉంటుంది.

కానీ నేటికీ ఓటమిని జీర్ణించుకోలేక బాధపడుతూ తన ఫామ్‌హౌస్‌కే పరిమితమైన ఆయన, శాసనసభకు రావడానికి చాలా ఇబ్బందికరంగానే ఉంటుంది. ఇప్పుడు ఆయనకు ఈ ఇబ్బంది కూడా తప్పిపోయింది.

గురువారం రాత్రి బాత్రూములో జారిపడటంతో తుంటి ఎముక విరిగిపోయింది. కుటుంబ సభ్యులు వెంటనే నిన్న అర్దరాత్రి ఆయనను హైదరాబాద్‌, సోమాజీగూడలోని యశోదా ఆస్పత్రికి తరలించారు. అన్ని వైద్య పరీక్షలు చేసిన తర్వాత వైద్యులు ఈరోజు సాయంత్రం ఆయన ‘తుంటి ఎముక మార్పిడి శస్త్ర చికిత్స’ చేయాలని నిర్ణయించారు.

శస్త్ర చికిత్స తర్వాత 6-8 వారాలు విశ్రాంతి తీసుకోవాలసి ఉంటుందని హెల్త్ బులెటిన్‌లో పేర్కొన్నారు. అంటే మరో రెండు నెలలు కేసీఆర్‌ శాసనసభకు వెళ్ళవలసిన అవసరం లేదు. ఆలోగా ఈ శాసనసభ ఎన్నికలు, కాంగ్రెస్‌, బిఆర్ఎస్ పార్టీల గెలుపోటములు అన్నీ పాతబడిపోతాయి.

అప్పటికి కాంగ్రెస్‌ ప్రభుత్వంతో రాజకీయ యుద్ధాలు ప్రారంభించడానికి ఏదో అంశాలు దొరకాకుండా ఉండవు. ఒకవేళ దొరకకపోయినా అప్పటికి లోక్‌సభ ఎన్నికల హడావుడి మొదలైపోతుంది. కనుక ఈ ఓటమిని జీర్ణించుకొని మళ్ళీ యుద్ధరంగంలో అడుగుపెట్టడానికి కేసీఆర్‌కి చాలా సమయమే లభించిందని చెప్పవచ్చు.

ADVERTISEMENT
Latest Stories