గులాబీ బాస్ కేసీఆర్ పాలనలో స్పీడు పెంచారు. మెరుగైన ఆరోగ్య సేవలను సామాన్యులకు అందుబాటులో ఉండేలా నిర్ణయం తీసుకున్నారు. పట్టణ ప్రాంతాల్లోని బస్తీలు, పల్లె ప్రాంతాలు కలిపి మొత్తం 3500 పైగా దవాఖానాలు ఏర్పాటు చేయనున్నారు. ఈమేరకు రాష్ట్ర వైద్యఆరోగ్య శాఖామంత్రి కీలక ప్రకటన చేశారు.
పల్లెలు, పట్టణాల్లోని బస్తీల్లో నివసిస్తున్న పేదలకు వైద్య సేవలను అత్యంత చేరువ చేయాలనే లక్ష్యంతో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విరివిగా దవాఖానాలు ఏర్పాటు చేయాలనే నిర్ణయం రాష్ట్ర ప్రభుత్వం తీసుకుందని హరీష్ రావు తెలిపారు.
మే నెల చివరి కల్లా పల్లెల్లో 3206 దవాఖానాలు పూర్తి స్థాయిలో అందుబాటులోకి రానున్నట్లు హరీష్ రావు తెలిపారు. అదేవిధంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని మేడ్చల్ – మల్కాజ్ గిరి, రంగారెడ్డి జిల్లాల్లోని బస్తీ ప్రాంతాల్లో 350 వరకు దవాఖానాలు, రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఇతర పట్టణాల్లో ఉన్న బస్తీల్లో 150 వరకు దవాఖానాలు అందుబాటులోకి తీసుకురానున్నట్లు హరీష్ రావు స్పష్టం చేశారు.
రాష్ట్రంలో ప్రస్తుతం 363 బస్తి దవాఖానాలు ఉన్నాయని, కొత్తగా మరో 57 దవాఖానాలు అందుబాటులోకి తెస్తున్నట్లు హరీష్ రావు ప్రకటించారు. వీటిని సత్వరమే ప్రారంభించేలా సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశామని హరీష్ రావు తెలిపారు.
అవసరం, డిమాండ్ ని బట్టి ఆదివారం కూడా దవాఖానాలు పనిచేసేలా చర్యలు తీసుకుంటున్నట్లు హరీష్ తెలిపారు. సీనియర్ డాక్టర్ ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు ఖచ్చితంగా అందుబాటులో ఉండాలని సంబంధిత అధికారులను మంత్రి ఆదేశించారు. పల్లె దవాఖానాలలో ఖాళీగా ఉన్న పోస్టులను వెంటనే భర్తీ చేయాలని అధికారులకు హరీష్ రావు సూచించారు



