తెలంగాణ ప్రభుత్వానికి ఈరోజు హైకోర్టులో గట్టిగా మొట్టికాయలు పడ్డాయి. రాష్ట్రంలో ఇంకా కరోనా ఉన్నందున రాజ్భవన్లోనే గణతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించుకోవాలని కోరుతూ తెలంగాణ ప్రభుత్వం గవర్నర్ తమిళిసై సౌందరరాజన్కి లేఖ వ్రాసింది.
దీనిపై అభ్యంతరం తెలుపుతూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. దానిపై నేడు అత్యవసర విచారణ చేపట్టిన హైకోర్టు ప్రభుత్వానికి గట్టిగా మొట్టికాయలు వేసింది. తప్పనిసరిగా పరేడ్తో కూడిన గణతంత్ర దినోత్సవ వేడుకలని ఘనంగా నిర్వహించాల్సిందేనని ఆదేశించింది. ప్రజలలో దేశభక్తి, జాతీయభావం పెంపొందించే జాతీయ పండుగని కరోనా వంటి కుంటిసాకులతో నిర్వహించకుండా తప్పించుకోవడం సరికాదని హైకోర్టు గట్టిగా చెప్పింది. దీంతో తెలంగాణ ప్రభుత్వం గణతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించక తప్పడం లేదు.
సిఎం కేసీఆర్ కొన్ని రోజుల క్రితం మీడియాతో మాట్లాడుతూ, “ఈ రాజ్యాంగం ఇప్పటి పరిస్థితులకి సరిపోదు. మళ్ళీ కొత్త రాజ్యాంగం రాసుకోవాల్సిందే,” అని నొక్కి చెప్పారు. అయితే బాబాసాహెబ్ నేతృత్వంలో ఎందరో మేధావులు చాలా దూరదృష్టితో ఆలోచించి రచించిన రాజ్యాంగాన్ని కేసీఆర్ పనికిరాదని, మార్చాలని చెప్పడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తడంతో కేసీఆర్ మళ్ళీ ఆ ప్రస్తావన చేయలేదు.
ఎప్పటికైనా ప్రధాని కావాలని, ప్రధానిగా ఢిల్లీలో ఎర్రకోటపై త్రివర్ణ పతాకం ఎగురవేయాలని కలలు కంటున్న సిఎం కేసీఆర్ గణతంత్ర దినోత్సవ వేడుకలని నిర్వహించడానికి వెనకాడుతుండటం, దేశంలో గుణాత్మకమైన మార్పు తెస్తానని చెపుతున్న సిఎం కేసీఆర్కి రాజ్యాంగం మీద నమ్మకం లేకపోవడం విడ్డూరంగానే ఉంది కదా?
అసలు కేసీఆర్ గణతంత్ర దినోత్సవ వేడుకలని నిర్వహించడానికి ఎందుకు వెనకాడుతున్నారు?అని ప్రశ్నించుకొంటే గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నందున ఆమెని సగౌరవంగా ఆహ్వానించి, ఆమె ఆధ్వర్యంలో ఈ వేడుకలు పాల్గొనడం ఇష్టం లేకనే అని ప్రతిపక్షాలు అప్పుడే విమర్శిస్తున్నాయి.



