ఇటీవలే ప్రారంభమైన బిగ్ బాస్ కార్యక్రమానికి సంబంధించిన వివాదం ముదురుతున్నట్టుగా కనిపిస్తుంది. బిగ్బాస్ నిర్వాహకులపై ఈ నెల 13న బంజారాహిల్స్ పోలీసులకు పాత్రికేయురాలు శ్వేతారెడ్డి ఫిర్యాదు చేశారు. బిగ్బాస్ ఇన్ఛార్జి శ్యాంతో పాటు రవికాంత్, రఘు, శశికాంత్లపై ఒప్పంద వ్యవహారంతో పాటు కాస్టింగ్ కౌచ్పై ఆరోపణలు చేశారు. దీని ప్రకారం బంజారాహిల్స్ పోలీసులు శ్యాంతోపాటు రవికాంత్, రఘు, శశికాంత్లపై కేసులు నమోదు చేశారు.
తాజాగా కేసులో విచారణ చేపట్టి వివరాలు సేకరించేందుకు స్టార్ మా కార్యాలయ అడ్మిన్ హెడ్ శ్రీధర్కు 91, 160 సీఆర్పీసీ కింద నోటీసులను అందించారు. ఒప్పంద వ్యవహారం, ఎంపికకు ఉన్న నిబంధనలు, శ్యాంతో పాటు మిగిలిన ముగ్గురి పాత్ర తదితర అంశాలపై మూడు రోజుల్లో సమాధానం ఇవ్వాలని సూచించారు. అయితే నోటీసులపై ఉన్నత స్థాయిలో చర్చించి రెండు రోజుల్లో సమాధానమిస్తామని పోలీసులకు శ్రీధర్ సమాధానమిచ్చారు. గతంలో ఈ కేసులు కొట్టివెయ్యాలని మా సంస్థ తెలంగాణ హై కోర్టుని ఆశ్రయించారు.
అయితే కేసులు కొట్టివెయ్యకుండా తమ తదుపరి ఆదేశాలు వచ్చే వరకు అరెస్టులకు దిగవద్దని కోర్టు ఆదేశించింది. అయితే ఈ తాజా పరిణామాలతో మా యాజమాన్యం ఆందోళన చెందుతుంది. ఇది ఇలా ఉండగా బిగ్ బాస్ హౌస్ లోకి 15 మంది కాంటెస్టెంట్స్ ప్రవేశించారు. రాహుల్, వరుణ్, బాబా భాస్కర్, వితికా, శ్రీముఖి, జాఫర్ లు మొదటి వారం ఎలిమినేషన్ లిస్టులో ఉన్నారు. మొదట ఎలిమినేట్ అయ్యేది ఎవరో చూడాల్సి ఉంది. ఈ సీజన్లో మొదటి కెప్టెన్ గా నటి హేమకు అవకాశం వచ్చింది.



