తెలుగు రాష్ట్రాలలో ఆ నలుగురూ…

chandrababu-naidu-kcr-ys-jagan-revanth-reddy

ఏపీ, తెలంగాణలలో జరిగిన రాజకీయ మార్పులను చూస్తున్నప్పుడు తప్పకుండా చంద్రబాబు నాయుడు, జగన్మోహన్‌ రెడ్డి, కేసీఆర్‌, రేవంత్‌ రెడ్డిల ప్రస్తావన అనివార్యం.

ADVERTISEMENT

ఏపీలో జగన్, తెలంగాణలో కేసీఆర్‌ తమకు తిరుగేలేదన్నట్లు వ్యవహరించేవారు. ఇద్దరూ ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటూ నిరంకుశ పాలన సాగించారు. ఇద్దరూ సొంత పార్టీ నేతలను కూడా నమ్మకుండా అవమానకరంగా ప్రవర్తించారు.

కేసీఆర్‌, జగన్‌ ఇద్దరూ మిత్రులుగా కొనసాగగలిగారు కానీ లోకంలో ప్రతీ ఒక్కరినీ శత్రువులుగా మార్చుకొని చివరికి ఇద్దరూ ఏకాకులుగా మిగిలిపోయారు. ఇద్దరూ తమ అహంకారం వలననే ఎన్నికలలో దారుణంగా ఓడిపోయి అధికారం కోల్పోవడం మరో విశేషం.

కానీ చంద్రబాబు నాయుడు, రేవంత్‌ రెడ్డి ఇద్దరూ ప్రతిపక్ష నేతలుగా అష్టకష్టాలు అనుభవించారు. అనేక సమస్యలు, సవాళ్ళు ఎదుర్కొంటూ నిబ్బరంగా నిలబడి పార్టీలను కాపాడుకుంటూ ఎన్నికలలో విజయం సాధించి అధికారం చేపట్టారు.

రేవంత్‌ రెడ్డిని పిసిసి అధ్యక్షుడుగా కూడా కాంగ్రెస్‌ నేతలు అంగీకరించలేదు. మరోపక్క తెలంగాణలో కేసీఆర్‌ తిరుగేలేని మొనగాడుగా, బిఆర్ఎస్ పార్టీ తిరుగులేని రాజకీయ పార్టీగా నిలిచింది. రేవంత్‌ రెడ్డి తనని నమ్మని, తన నాయకత్వాన్ని అంగీకరించని కాంగ్రెస్‌ నేతలతో సతమతమవుతూనే, శాసనసభ ఎన్నికలలో కేసీఆర్‌ని ఓడించి మూలకూర్చోపెట్టారు. రేవంత్‌ రెడ్డి ఉన్న పరిస్థితిలో ఇది అసంభవమే. కానీ సాధించి రాజకీయాలలో కేసీఆర్‌ కంటే మొనగాడినని నిరూపించి చూపారు.

ఇక చంద్రబాబు నాయుడు 40 ఏళ్ల రాజకీయ జీవితంలో ఎదుర్కొన్న ఒడిదుడుకులన్నీ ఒక ఎత్తు అయితే ఈ 5 ఏళ్ల జగన్‌ పాలనలో ఎదుర్కొన్న ఒడిదుడుకులన్నీ మరో ఎత్తు. అవన్నీ అందరికీ తెలుసు. మరొకరైతే ఈ వయసులో ఈ అవమానాలు, వేధింపులు అవసరమా? అని రాజకీయాల నుంచి తప్పుకొని వెళ్ళిపోయేవారు. ఉదాహరణకు ప్రజారాజ్యంతో ప్రత్యక్ష రాజకీయాలలోకి వచ్చిన చిరంజీవి కొద్దిపాటి రాజకీయ ఒత్తిళ్ళు, అవమానాలు భరించలేక వెంటనే రాజకీయాల నుంచి తప్పుకున్నారు.

కానీ 75 ఏళ్ళ వయసులో ఈ ఒత్తిళ్ళన్నిటినీ తట్టుకొని భరిస్తూ, పార్టీని చెల్లాచెదురు అయిపోకుండా కాపాడుకోవడమే చాలా గొప్ప విషయమనుకుంటే, తన రాజకీయ అనుభవం అంతా ఉపయోగించి ఎన్నికలలో వైసీపిని చావుదెబ్బ తీసి మళ్ళీ ముఖ్యమంత్రి పదవి చేపట్టబోతున్నారు.

చంద్రబాబు నాయుడు కేసీఆర్‌లాగా ప్రధాన మంత్రి పదవి చేపడతాన్ని, కేంద్రంలో చక్రం తిప్పుతానని ప్రగల్భాలు పలకలేదు. కానీ రాజకీయంగా ఆయన తీసుకున్న కొన్ని నిర్ణయాలతో ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఏర్పాటులో కీలకపాత్ర పోషించబోతున్నారు.

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో చిక్కుకొని రెండున్నర నెలలుగా జైల్లో మగ్గుతున్న తన కూతురు కల్వకుంట్ల కవితని విడిపించుకోవడానికి కేసీఆర్‌ తిప్పలు పడుతుంటే, చంద్రబాబు నాయుడు టిడిపికి లోక్‌సభ స్పీకర్, కేంద్రమంత్రి పదవుల గురించి మోడీ, అమిత్ షాలతో చర్చిస్తున్నారు.

ఇక చివరాఖరుగా చెప్పుకోవలసిన వ్యక్తి జగన్మోహన్‌ రెడ్డి. తండ్రి పేరు చెప్పుకొని అధికారంలోకి వచ్చి రాక్షస పాలన చేసిన జగన్‌, రాష్ట్రంలో ప్రజలందరి చేత ఛీ కొట్టించుకొని ఎవరికీ మొహం చూపలేకపోతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా బోసిపోయిన వైసీపి కార్యాలయాలపై ‘నువ్వే మా నమ్మకం జగన్‌’ అనే బోర్డులను చూసి జనం నవ్వుకుంటే, వైసీపి నేతలు, కార్యకర్తలు సిగ్గు, అవమానంతో తలదించుకుంటున్నారు.

ADVERTISEMENT
Latest Stories