కలియుగ దైవంగా పూజలందుకుంటున్న తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయంలో తాగే మంచి నీరు నుండి తినే ఆహారం వరకు అంతా స్వామి వారి ప్రసాదంగానే భావిస్తారు భక్తులు. అయితే ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి 1985 ఏప్రిల్ లో తిరుమల భక్తులకు ఉచిత అన్నదాన పథకాన్ని మొదలుపెట్టారు.
మొదటిలో పరిమిత సంఖ్యలో ఈ అన్నప్రసాదం భక్తులకు అందుబాటులో ఉండేది.క్రమక్రమంగా ఈ కార్యక్రమాన్ని విస్తరిస్తూ ఈ శ్రీవారి అన్నప్రసాదాన్ని తిరుమల విచ్చేసిన ప్రతి భక్తుడికి అందుబాటులో ఉంచారు.అయితే భక్తుల సంఖ్యలోనూ, నాణ్యతలోనూ అంచెలంచెలుగా ఎదుగుదల చూసిన శ్రీవారి అన్నప్రసాదం ఇప్పుడు నాసిరకమైన భోజనంతో భక్తుల ఆగ్రహాన్ని చూడాల్సి వచ్చింది.
వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి తిరుమల పై టీటీడీ తీసుకుంటున్న చర్యలు అన్ని వివాదాస్పదంగానే మారుతున్నాయి. శ్రీ వారి సేవ టిక్కెట్ల ధరల నుంచి వసతి గృహాల రేట్ల వరకు అన్ని సామాన్యుడికి అందుబాటులో లేకుండా చేశారు. ఎప్పటికప్పుడు ధరలు పెంచి సౌకర్యాలు తగ్గించి భక్తుల మనోభావాలతో ఆటలు ఆడుకుంటూ వచ్చింది.
చివరికి టీటీడీ ఈవో నియామకంలో కూడా వైసీపీ ప్రభుత్వం హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా నిర్ణయం తీసుకుంది అంటూ బీజేపీ రాష్ట్ర నాయకుడు భానుప్రకాష్ రెడ్డి మీడియా ముఖంగా పలు సందర్భాలలో జగన్ ప్రభుత్వాన్ని విమర్శించారు.అయితే తిరుమల ఏడుకొండల వారి దర్శనానికి వచ్చిన భక్తులు అత్యంత పవిత్రంగా భావించేది శ్రీ వారి అన్నప్రసాదం.పేద, ధనిక అనే తేడా లేకుండా బాలాజీ భక్తులందరూ భుజించే భోజనం ఈ శ్రీవారి అన్నప్రసాదం.
అయితే తాజాగా టీటీడీ భక్తులకు పెడుతున్న శ్రీవారి భోజనం నాసిరకంగా ఉందంటూ పలువురు భక్తులు టీటీడీ సిబ్బంది పై వాగ్వాదానికి దిగారు. మరీ ఇంత నాసిరకం భోజనం పెడతారా? అసలు మనుషులు తినే భోజనమేనా ఇది? కమీషన్లకు కక్రుత్తి పడి ఇటువంటి ఆహారం పెడతారా? అంటూ వెంకన్న భక్తులు టీటీడీ ఉద్యోగులకు ఎదురుతిరిగారు.చాలా మంది భక్తులు ఈ నాసిరకం భోజనం తినలేక పెట్టిన ఆహారం అక్కడే వదిలేసి వెళ్లిపోయిన దృశ్యాలు చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు మరి కొంతమంది భక్తులు.
వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సామాన్యుడికి శ్రీ వారి సేవలు గోవిందా… అనుకుంటే ఇప్పుడు అన్నప్రసాదం కూడా గోవిందా…అయ్యే పరిస్థితి వచ్చింది అంటూ భక్తులు టీటీడీ బోర్డు మీద వైసీపీ ప్రభుత్వం మీద పెద్ద ఎత్తున విమర్శలకు దిగుతున్నారు. ఇప్పటికైనా టీటీడీ కళ్ళు తెరిచి చేసిన తప్పు దిద్దుకుంటుందో లేక వారికి అలవాటైన ఏదో ఒక పిట్ట కథ చెప్పి భక్తుల నోరు మూపిస్తుందో చూడాలి.




