ఇంతవరకు ఏడుకొండల వెంకన్న పట్ల అపచారాలు చేసిన ప్రతీ ఒక్కరూ మూల్యం చెల్లించారు. గత 20-30 ఏళ్ళ చరిత్ర చూస్తే అలాంటివారు ఎందరో కనపడతారు. ఆ చరిత్ర చూసే ఓపిక లేనివారికి తాజా పరిణామాలు చూసినా ఈ విషయం అర్ధమవుతుంది.
నిజానికి ఆలయాలలో పనిచేసే అర్చకులతో సహా సిబ్బంది చాలా అదృష్టవంతులు. పూర్వ జన్మ సుకృతం వల్లనే వారికి ఆ అవకాశం లభించిందని చెప్పవచ్చు.
కానీ వారు తెలిసో తెలియకో అపచారాలు చేస్తూనే ఉంటారు. దశాబ్దాల పాటు స్వామివారి సేవలో తరించిన డాలర్ శేషాద్రి, రమణ దీక్షితులు, పలువురు టిటిడీ ప్రముఖులు స్వామివారికి తెలిసో తెలియకో అపచారాలు చేసినందుకు ప్రత్యక్షంగానో లేదా పరోక్షంగానో మూల్యం చెల్లించారు కదా?
తెలియక చేసే అపచారాలకు నిష్కృతి ఉంటుంది. కానీ తెలిసి చేసే వాటికి ఉండదు. ముఖ్యంగా స్వామివారి పట్ల భక్తి, నమ్మకం లేనివారే ఇలాంటి అపచారాలకు పాల్పడే సాహాసాలు చేస్తుంటారు.
వైసీపీ హయంలో ఇలాంటివారితో టిటిడీని నింపేశారు. కనుక ఎవరూ ఊహించని అపచారాలు, దొంగతనాలు జరిగాయి. వారికి వెంకన్నపై భక్తి, నమ్మకం లేవు గనుక భయం, పాపభీతి కూడా ఉండకపోవచ్చు. వెంకన్న ఓ రాతి విగ్రహం మాత్రమే. ఆ విగ్రహానికి ఎటువంటి మహిమలు ఉండవనుకున్నారు.
ఆ ధైర్యంతోనే వారు పరమ పవిత్రమైన స్వామివారి ప్రసాదంలో కల్తీ నెయ్యిని వాడారు. పరకామణిలో స్వామివారి సొమ్ము దొంగతనం చేసేందుకు సాహసించారు.
కానీ ఆ నేరాన్ని చేసినవారు మాత్రమే కాదు చూసినవారు, చూసి రాజీ పడినవారు కూడా మూల్యం చెల్లిస్తున్నారు కదా?
కనుక వెంకన్న లేదా మరో మతానికి చెందిన దేవుడిపై మనకు నమ్మకం లేదని ఇలాంటి తప్పులు, అపచారాలు చేస్తే ఎవరూ ఆ భగవంతుడి దృష్టి నుంచి తప్పించుకోలేరు.
పరకామణి కేసులో టిటిడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డికి ఏపీ సీఐడీ అధికారులు నోటీస్ జారీ చేయడమే ఇందుకు నిదర్శనం. మంగళవారం సాయంత్రం 4 గంటలకు పద్మావతి అతిధి గృహంలో విచారణకు హాజరు కావాలని పేర్కొన్నారు.
వెంకన్న స్వామిపై నమ్మకం లేని వైసీపీ నాయకులకు ఇలాంటి కష్టాలు మొదలవడం రాజకీయ కక్ష అనుకుంటే అనుకోండి… కానీ అపచారం చేసిన వెంటనే కష్టాలు మొదలవడమే కాకతాళీయం కాదు కదా?






