అధికారంలో ఉన్నప్పుడు నా అంతటివాడు లేడు… నాకు ఎదురే లేదని పెట్రేగిపోతే ఏమవుతుందో తెలంగాణలో కేసీఆర్, బిఆర్ఎస్ పార్టీలను వారి కనుసన్నలలో మసులుకున్న పోలీస్ అధికారులను చూస్తే అర్దమవుతుంది.
కాళేశ్వరం ప్రాజెక్టులో కేసీఆర్ ఒత్తిడికి తలొగ్గి అవినీతి, అక్రమాలలో భాగం అయినందుకు, ఇప్పుడు వారందరి మెడలకు కేసులు చుట్టుకోబోతున్నాయి.
తాజాగా బయటపడిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఇంటలిజన్స్ డీఎస్పీ ప్రణీత్ రావుని అరెస్ట్ చేసి విచారిస్తే బిఆర్ఎస్ డొంక కదులుతోంది.
తెలంగాణలో జరిగిన మూడు ఉప ఎన్నికలలో ఇద్దరు ఎస్పీలు భుజంగరావు, తిరుపతన్న తమ పోలీస్ వాహనాలలోనే నియోజకవర్గాలకు డబ్బు తరలించిన్నట్లు బయటపడటంతో శనివారం వారిద్దరినీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఎస్పీ, డీఎస్పీ స్థాయి అధికారుల అరెస్ట్ మామూలు విషయం కాదని అందరికీ తెలుసు.
మరో విషయం ఏమిటంటే హైదరాబాద్, జూబ్లీహిల్స్లోని రేవంత్ రెడ్డి ఇంటికి 1-2 కిమీ దూరంలో ఓ కమర్షియల్ బిల్డింగ్ అద్దెకు తీసుకొని అక్కడి నుంచే రేవంత్ రెడ్డి, ఆయన కుటుంబ సభ్యుల ఫోన్లు ట్యాపింగ్ చేస్తుండేవారిమని ప్రణీత్ రావు బయట పెట్టారు.
ఏపీలో జగన్ ప్రభుత్వం కూడా పోలీస్ అధికారులతో సహా వివిద శాఖల అధికారులను యదేచ్చగా వాడుకొంటూ అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని, తమ ఫోన్లను ట్యాపింగ్ చేయిస్తోందని బోండా ఉమా వంటి సీనియర్ టిడిపి నేతలు పదేపదే ఆరోపిస్తుండటం అందరూ వింటూనే ఉన్నారు.
తాజాగా విశాఖ పోర్టులో డ్రగ్స్ కంటెయినర్ పట్టుబడినప్పుడు కొందరు ఉన్నతాధికారులు అక్కడకు చేరుకొని హడావుడి చేశారని, తమకు సంబందం లేనప్పుడు వారు అక్కడకు ఎందుకు వెళ్ళారని టిడిపి సీనియర్ నేత పట్టాభి ప్రశ్నించడం అందరికీ తెలిసిందే.
అలాగే ఓటర్ల జాబితాలో అవకతవకల గురించి చంద్రబాబు నాయుడు కేంద్ర ఎన్నికల కమీషన్కు ఫిర్యాదు చేయవలసి వచ్చిందంటే రాష్ట్రంలో అధికార యంత్రాంగం ఏవిదంగా పనిచేస్తోందో అర్ధం చేసుకోవచ్చు.
వైసీపి నేతలు రాష్ట్రంలో ఇసుక, మట్టి, కొండలు, గుట్టలను యదేచ్చగా తవ్వేసుకొంటున్నా, మద్యం, మైనింగ్ మాఫియాలు చెలరేగిపోతున్నా అధికారులు ఎవరూ ధైర్యంగా అడ్డుకోలేని పరిస్థితి నెలకొంది.
అంటే నిన్న తెలంగాణలో జరిగిందే నేడు ఏపీలో కూడా జరుగుతోందన్న మాట! కనుక నేడు తెలంగాణలో జరుగుతున్నట్లే రేపు ఏపీలో ప్రభుత్వం మారితే వైసీపి అక్రమాలకు, అవినీతికి సహకరిస్తున్న ఉన్నతాధికారులు కూడా జైలుకి వెళ్ళవలసి రావచ్చు.
ఒకవేళ తెలంగాణలో జరుగుతున్న ఈ పరిణామాలు ఏవీ వారికి తెలియవని అనుకున్నా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్ ముగ్గురూ చేస్తున్న హెచ్చరికలు వింటూనే ఉన్నారు కదా?కనుక ఇప్పటికైనా మేల్కొని నిష్పక్షపాతంగా తమ విధులు నిర్వర్తిస్తే వారికే మంచిది.






